
తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆరోపిస్తూ.. సెల్ఫీ వీడియోలో పలు ఆరోపణలు అసోషియేషన్లో కలకలం రేపుతున్నాయి.
సాక్షి, విజయవాడ : కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి శ్రీకాంత్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. ఆత్మహత్యాయత్నానికి ముందు శ్రీకాంత్ సెల్ఫీ వీడియో తీసుకుని అందుకు గల కారణాలు వెల్లడించాడు. అయితే పురుగుల మందు తాగడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సెల్ఫీ వీడియో వైరల్గా మారింది. ఆ వివరాలిలా.. ఏపీ కబడ్డీ సంఘం అధ్యక్షుడు వీర లంకయ్య తనపై కక్ష సాధిస్తున్నాడని శ్రీకాంత్ ఆరోపించారు. ‘నా మీద కోపంతో క్రీడాకారులను ఇబ్బంది పెడుతున్నారు. టీమ్ సభ్యులను కబడ్డీకి దూరం చేస్తున్నారు. కబడ్డీ ఆటగాళ్లకు అన్యాయం చేస్తున్న వీరలంకయ్యకు కేఈ ప్రభాకర్ అండగా ఉన్నారు. వారి నుంచి నాకు ప్రాణహాని ఉంది. నా మరణంతోనైనా క్రీడాకారులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానంటూ’సెల్ఫీ వీడియోలో శ్రీకాంత్ పలు ఆరోపణలు చేయడం ఏపీ కబడ్డీ అసోసియేషన్లో అలజడి రేపుతోంది.