లోకల్ ‘లాక్డౌన్’
రాష్ట్రమంతటా ప్రజల స్వీయ నిర్బంధం
అక్కడక్కడా తప్ప ఇళ్లల్లోంచి బయటకురాని జనం
నిర్మానుష్యంగా రోడ్లు
కరోనా వ్యాపించకుండా ‘కంచె’ వేసిన గ్రామీణులు
సాక్షి, నెట్వర్క్: కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా రాష్ట్రంలో ప్రకటించిన లాక్డౌన్ బుధవారం విజయవంతంగా అమలైంది. ప్రజలు స్వచ్ఛందంగా స్వీయ నియంత్రణ పాటిస్తూ గృహాలకే పరిమితమయ్యారు. ఒకరిద్దరు తప్ప రోడ్ల మీదకు పెద్దగా రాలేదు. తమ గ్రామాల్లోకి ఇతరులెవరూ రావడానికి వీల్లేదంటూ రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామాల ప్రజలు రోడ్లను దిగ్బంధనం చేశారు. గ్రామ పొలిమేర్లలో రోడ్డుకు అడ్డంగా ముళ్లకంప, బండరాళ్లు, వాహనాలను అడ్డుపెట్టారు. ఎక్కడికక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తమ గ్రామంలోకి రాకుండా, తమ గ్రామస్తులు బయటకు పోకుండా నియంత్రించారు.
- తూర్పుగోదావరి జిల్లా అమలాపు రం పట్టణంలోని గాంధీనగర్, విత్తనాలవారి కాల్వగట్టు, కామనగరు వు, మెట్ట ప్రాంతం కిర్లంపూడి, గోకవరం, రంపచోడవరం ఏజెన్సీ లోని పలు గ్రామాల్లో ప్రజలు.. ఇతరులను తమ ప్రాంతాల్లోకి రానీయకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.
- పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలంలోని గిరిజన పల్లెలు ప్రత్యేకంగా సమావేశమై తమ గ్రామంలోకి రాకుండా ఇతరులను అడ్డుకోవాలంటూ ఏకంగా తీర్మానం చేశారు. వంతులు వారీగా సరిహద్దుల్లో కాపలా పెట్టారు.
- ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరకొండపాలెం, కురిచేడు మం డలం వంగాయపాలెం తదితర గ్రామాల్లోని ప్రజలు తమ గ్రా మ పొలిమేర్ల వద్ద రహదారులపై ముళ్ల కంప వేశారు. శ్రీపొట్టిశ్రీరాములునెల్లూరు జిల్లాలోని పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి కనిపించింది.
- వైఎస్సార్ జిల్లా ఎగువరామాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద యువత చెక్పోస్టు ఏర్పాటు చేశారు.
- చిత్తూరు జిల్లాలో కార్వేటినగరం, నారాయణవనం, రొంపిచెర్ల, శ్రీకాళహస్తిలోని పలు గ్రామాల పొలిమేర్లను ఆయా గ్రామస్తులు మూసేశారు.
- కర్నూలు జిల్లా పాణ్యం మండలంలోని తెలుగుపేట, కొండజూ టూరు, మిడుతూరు మండలంలోని చౌట్కూరు, పెద్దకడబూ రు మండల కేంద్రం, దేవనకొం డ, తుగ్గలి మండల కేంద్రాల్లో ప్రజలు తమ గ్రామాల్లోకి ఇతరులెవర్నీ రానీయకుండా రోడ్డుకు అడ్డంగా ఎద్దుల బండ్లు, ఇనుప సామగ్రి, బండరాళ్లను ఉంచారు. బతికుంటే 21 రోజుల తర్వాత మళ్లీ కలుద్దాం’ అంటూ.. కొన్ని చోట్ల బోర్డులు కూడా ఏర్పాటు చేయడం విశేషం.
- విశాఖ జిల్లాలో పలు వీధుల్లోనూ, రూరల్లోని వివిధ గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా రహదారులను మూసివేసి కంచెలు ఏర్పాటు చేశారు.
- చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తికి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో పట్టణంలో హైఅలెర్ట్ ప్రకటించారు. అధికారులందరూ అప్రమత్తమై వ్యాధి సోకిన వ్యక్తి ఇంటి చుట్టు పక్కల 3 కిలోమీటర్ల పరిధిలోని 7వార్డులను పూర్తిగా షట్డౌన్ చేశారు.
సంబంధిత వార్తలు