‘ఉక్కై’పె సెయిల్ అధికారుల సమీక్ష | Sail officials Review | Sakshi
Sakshi News home page

‘ఉక్కై’పె సెయిల్ అధికారుల సమీక్ష

May 25 2014 2:04 AM | Updated on Sep 2 2017 7:48 AM

జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యాసాధ్యాల పరిశీలన కోసం జిల్లా పర్యటనకు వచ్చిన 8 మందితో కూడిన సెయిల్ నిపుణుల కమిటీ శనివారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించింది.

కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ :  జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యాసాధ్యాల పరిశీలన కోసం జిల్లా పర్యటనకు వచ్చిన 8 మందితో కూడిన సెయిల్ నిపుణుల కమిటీ శనివారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించింది. ఉక్కు ఫ్యాక్టరీ కోసం ప్రతిపాదనలో ఉన్న మూడు ప్రాంతాల గురించి కలెక్టర్ శశిధర్ వివరించారు. కొప్పర్తి వద్ద 2927 ఎకరాలు, జమ్మలమడుగు మండలం అంబవరం వద్ద 10,760 ఎకరాలు, మైలవరం మండలం కంబాలదిన్నె వద్ద 4386 ఎకరాల భూమి ఉందని తెలిపారు.
 
 ఈ ప్రదేశాల సమీపంలో విద్యుత్, నీరు, ఎయిర్‌పోర్టు, రైల్వే లైన్, నేషనల్ హైవే, స్టేట్ హైవేలు ఉన్నాయన్నారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లకు గల దూరం గురించి తెలిపారు. జిల్లాలోనేకాక చుట్టుప్రక్కల ఉన్న ఖనిజ లభ్యత గురించి సెయిల్ అధికారులు ఆరా తీశారు. వీటి వివరాలు సేకరించి అందజేస్తామని కలెక్టర్ వారికి చెప్పారు. సోమశిల ప్రాజెక్టు ద్వారా నీటి ఏర్పాటుకు 20 కోట్ల రూపాయలు ఖర్చుచేస్తామని తెలిపారు. అలాగే అంబవరం, కంబాలదిన్నె ప్రాంతాలకు మైలవరం రిజర్వాయర్ నుంచి నీటి లభ్యత ఉంటుందన్నారు. ఈ సమావేశంలో సెయిల్ డీజీఎంలు ఆర్‌కె సిన్హా, ఏ మైథి, బి.సర్కార్, ఎ.కుమార్, కెఎస్ సావర్నీ, ఎస్.సింగ్, అడిషనల్ మేనేజర్లు ఆర్.బెనర్జీ, డి.సాహులతోపాటు జాయింట్ కలెక్టర్ రామారావు, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జి.గోపాల్, విధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement