రూ. 5195 | Rupes. 5195 | Sakshi
Sakshi News home page

రూ. 5195

May 29 2014 1:57 AM | Updated on Sep 2 2017 7:59 AM

2014-15 ఆర్థిక సంవత్సరంలో వివిధ రుణాల కింద రూ. 5195.47 కోట్లను మంజూరు చేయాలని జిల్లా కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు.

కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : 2014-15 ఆర్థిక సంవత్సరంలో వివిధ రుణాల కింద రూ.  5195.47 కోట్లను మంజూరు చేయాలని జిల్లా కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. బుధవారం కలెక్టర్ అధ్యక్షతన  జరిగిన డీసీసీ ప్రత్యేక సమావేశంలో వార్షిక రుణ ప్రణాళికను ఆమోదించారు. లీడ్ డిస్ట్రిక్ట్ చీఫ్ మేనేజర్ లేవాకు రఘునాథరెడ్డి వార్షిక రుణ ప్రణాళిక గురించి వివరించారు.
 
 గత ఆర్థిక సంవత్సరం రూ. 3845.10 కోట్ల రుణ లక్ష్యానికిగాను రూ. 3838.93 కోట్లను (99.85 శాతం) పంపిణీ చేశారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ యేడు వార్షిక రుణ ప్రణాళిక ద్వారా వివిధ రంగాలకు అదనంగా 17.45 శాతం రుణాలను మంజూరు చేయాలని నిర్ణయించారు. ఈ ఏడాది ప్రాధాన్యత రంగాలకు 4419.26 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇది గత ఏడాదితో పోలిస్తే 14.93 శాతం అధికం. వ్యవసాయ, అనుబంధ రంగాలకు 3284.60 కోట్లు కేటాయించారు.
 
 గత ఏడాదికన్నా ఇది 16.40 శాతం అధికం. స్వల్పకాలిక పంట రుణాల కింద రూ. 2372.39 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. ఇది గత ఏడాది కంటే 18.34 శాతం ఎక్కువ. వ్యవసాయ టర్మ్ లోన్స్ కింద రూ. 281.75 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇది గత సంవత్సరం కన్నా 10.96 శాతం అధికం. వ్యవసాయ యాంత్రీకరణ కోసం 216.09 కోట్ల రూపాయలు ఇవ్వాలని లక్ష్యంగా తీర్మానించారు.
 
 ప్లాంటేషన్ హార్టికల్చర్ ఫార్మింగ్ కింద 13.87 కోట్లు రుణాలను మంజూరు చేయాలన్నది ఈ యేటి లక్ష్యం. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు రూ. 630.46 కోట్లు, వ్యవసాయేతర రుణాల కింద రూ. 307.85 కోట్లు, ఇతర ప్రాధాన్యత రంగాలకు రూ. 826.81 కోట్లు, అప్రాధాన్యత రంగాలకు రూ. 776.21 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. సమావేశంలో  నాబార్డు ఏజీఎం శ్రీనివాసులు, సిండికేట్‌బ్యాంకు ఏజీఎం శేఖర్, ఏపీజీబీ రీజినల్ మేనేజర్ శివశంకర్‌రెడ్డి, ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్ సుబ్రమణ్యం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement