మనసెలా వచ్చిందో...! | Responsible, along with the knowledge and education | Sakshi
Sakshi News home page

మనసెలా వచ్చిందో...!

Feb 10 2014 2:12 AM | Updated on Sep 2 2017 3:31 AM

గురువును దేవుడితో పోలుస్తాం.. విద్యాబుద్ధులతో పాటు జ్ఞానాన్ని అందివ్వాల్సిన బాధ్యత గురువుదే.. ఉన్నత స్థానంలో నిలవాల్సిన గురువులు అక్కడక్కడ వక్ర మార్గం పడుతున్నారు.

ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: గురువును దేవుడితో పోలుస్తాం.. విద్యాబుద్ధులతో పాటు జ్ఞానాన్ని అందివ్వాల్సిన  బాధ్యత గురువుదే.. ఉన్నత స్థానంలో నిలవాల్సిన గురువులు అక్కడక్కడ వక్ర మార్గం పడుతున్నారు. గురువు స్థానానికే తలవంపులు తెస్తున్నారు. కేవలం రూ. 500 పోయిందని ఓ టీచర్ విద్యార్థుల చేతులు కాల్చి ఉపాధ్యాయ వృత్తికే మచ్చ తెచ్చింది. ప్రొద్దుటూరు మండలం ఈశ్వరరెడ్డినగర్‌లోని  ప్రాథమికోన్నత పాఠశాలలో  టీచర్‌గా పనిచేస్తున్న జయ అమృతాబాయి పర్సులోని రూ. 500  ఎక్కడో పోయింది.  ఎవరైనా తీశారా అంటూ విద్యార్థులను ప్రశ్నించింది.
 
 అంతటితో ఆగక విద్యార్థుల బ్యాగులు, పుస్తకాలలో సోదా చేయించింది. అంతటితో వదలకుండా కర్పూరం తెప్పించి విద్యార్థుల చేతుల్లో పెట్టి వెలిగించింది. ఎవరైనా డబ్బు తీసుకుని ఉంటే వారి చేతులు కాలుతాయని హెచ్చరించింది.  హుసేన్‌బాషా, రమేష్, యాసిన్, మాధవి, తనూజ, వనజ, చిన్ని అనే విద్యార్థులు మంటకు తాళలేక కర్పూరాన్ని కింద వేశారు. ఈశ్వరమ్మ  అనే విద్యార్థి కర్పూరాన్ని అలాగే ఉంచుకోవడంతో చేతికి బొబ్బలు వచ్చాయి. మరో  విద్యార్థికి ఇలాగే జరిగింది. టీచర్ బెదిరించడంతో ఈశ్వరమ్మ విషయాన్ని ఇంట్లో చెప్పలేదు.  చేతికి బొబ్బలు ఉండటం గమనించిన అవ్వ కుళాయమ్మ  ఈశ్వరమ్మను  నిలదీసింది. దీంతో ఈశ్వరమ్మ జరిగిన విషయాన్ని తెలిపింది.
 
 అందరి చేతుల్లో కర్పూరం  పెట్టింది
 డబ్బు పోయిందని మా అందరి చేతుల్లో  కర్పూరం వెలిగించింది.   ఆ బాధ తట్టుకోలేక వెంటనే కింద పడేశా. ఈశ్వరమ్మ, తనుజా అలాగే పెట్టుకున్నారు. జరిగిన సంఘటనను బయట చెప్పవద్దని టీచర్ హెచ్చరించింది.    
 - మాధవి, విద్యార్థిని
 
 చేతులెలా వచ్చాయో
 చిన్న పిల్లల చేతుల్లో కర్పూరం వెలిగించడానికి ఆ టీచర్‌కు చేతులెలా వచ్చాయో.. చదువుకున్న వారు చేసే పనేనా ఇది.. ఇలాంటి వారి  వల్లే ప్రభుత్వ పాఠశాలలపై  నమ్మకం పోతోంది..
 - కుల్లాయమ్మ, ఈశ్వరమ్మ అవ్వ
 
 విచారణ చేస్తాం     
 పాఠశాలలో జరిగిన సంఘటన నా దృష్టికి రావడంతో ప్రాథమికంగా విచారించాం. నిజమేనని తేలింది. సోమవారం పాఠశాలకు వెళ్లి పూర్తి స్థాయిలో విచారణ చేపడతాం.
 - రాజగోపాల్‌రెడ్డి, ఇన్‌చార్జి ఎంఈఓ, ప్రొద్దుటూరు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement