
దుక్కిదున్ని.. దిక్కులు చూస్తూ..!
దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా మారింది జిల్లాలో ఖరీఫ్ రైతుల పరిస్థితి.
ప్రహసనంగా పంట రుణాలు మొండి చెయ్యి చూపిస్తున్న బ్యాంకర్లు
వడ్డీ వ్యాపారులే దిక్కు అయోమయంలో అన్నదాత ప్రశ్నార్థకంగా ఖరీఫ్ సాగు
దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా మారింది జిల్లాలో ఖరీఫ్ రైతుల పరిస్థితి. తొలకరి పలకరించినా చేతిలో చిల్లిగవ్వలేక దుక్కులు దున్ని దిక్కులు చూడాల్సిన దుస్థితి నెలకొంది. బ్యాంకు రుణాలు అందక.. ఇన్పుట్ సబ్సిడీ రాక.. ప్రయివేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. పెట్టుబడి కోసం నగానట్రా తాకట్టుపెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది.
చిత్తూరు : ఖరీఫ్ కష్టాలు మొదలయ్యాయి. తొలకరి పలకరించినా పంట పెట్టుబడికి చేతిలో చిల్లిగవ్వలేక రైతులు దిక్కులు చూడాల్సి వస్తోంది. ఇప్పటివరకు జిల్లాలో ఒక్కరైతుకూ ప్రభుత్వ రుణం అందక ప్రయివేటు వడ్డీవ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. రైతులకు బాసటగా నిలిచి బ్యాంకు రుణాలు ఇప్పించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.
అందని ద్రాక్షలా ఇన్పుట్సబ్సిడీ
జిల్లా ైరె తులకు ఇన్పుట్ సబ్సిడీ అందని ద్రాక్షలా మారింది. గత రెండు ఖరీఫ్లకు సంబంధించి ఇన్పుట్సబ్సిడీ రూ.205 కోట్ల వరకు రావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు దానిపై ప్రభుత్వం కనీసం నిర్ణయమూ తీసుకోలేదు. రెండేళ్లు గడచినా సబ్సిడీ రాకపోవడంతో నిరాశకు గురవుతున్నారు.
ప్రైవేటు భారం
రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు రైతులకు చుక్కలు చూపుతున్నారు. పాత రుణాలు కడితేనే కొత్త రుణాలు ఇస్తామని తెగేసి చెబుతుండడంతో విధిలేని పరిస్థితుల్లో ప్రయివేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. దళారులు ఒక రోజుకు రూ.10వేలకు రూ.500 వడ్డీ వసూలు చేస్తున్నారు. ఇదే మొత్తాన్ని బ్యాంకులో రుణం తీసుకుంటే రూ.1.50 పైసలు పడుతుంది. ప్రైవేటు దళారులు వందకు రూ.3 నుంచి రూ.4 వరకు వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన రమారమీ ప్రతి సంవత్సరమూ రూ.50 కోట్ల వరకు రైతులు వెచ్చించాల్సి వస్తోంది.
రుణమాఫీ ఏదీ
తాము అధికారంలోకి వస్తే వ్యసాయ రుణాలు మాఫీ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కర్షకుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన తరువాత కొర్రీలు పెడుతుండటంతో ైరె తులకు మాఫీ ఫలాలు అందటం లేదు. జిల్లాలో 8.70 లక్షల రైతులకు బ్యాంకుల్లో రూ.11,180.25 కోట్ల రుణాలు ఉన్నాయి. మొదటి విడతగా రూ.600 కోట్లు చెల్లించి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. రెండో విడత అని రైతులను ఊరిస్తోంది. వాటికి ప్రస్తుతం రుణ ఉపశమన పత్రాలు పంపిణీ చేయనున్నారు. ఈసొమ్ములు ఎప్పటికి చేతికి వచ్చేనో.
చేయూత లేకుండా ఏరువాక సంబరాలా?
రె తులకు ప్రభుత్వం చేయూత నివ్వకుండా ఏరువాక సంబరాలు నిర్వహిస్తుండడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ ప్రారంభమై పది రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు రుణాలు మంజూరు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట రుణాలు లేకుండా ఏరువాక ఎలా సాగించాలని పలువురు ప్రశ్నిస్తున్నారు.
బ్యాంకర్ల నిర్లక్ష్యం
జిల్లా రైతులకు రుణం ఇచ్చి ఆదుకోవాల్సిన బ్యాంకర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కొత్త రుణాలు, ఉన్న రుణాలను రెన్యువల్ చేయాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఒక్క కొత్త రుణం కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది రుణ లక్ష్యం రూ.3,176 కోట్లు ఉండగా ఇందులో ఈ ఖరీఫ్కు దాదాపు రూ.1,500 కోట్ల మేరకు రుణాలు అందించాలని బ్యాంకర్లకు ప్రభుత్వం నిర్దేశించింది. అయితే ఇప్పటి వరకు ఎంత మంది రైతులకు ఇచ్చారో అధికారుల వద్దే సమాచారం లేదు.