టీడీపీ రాజకీయ కుట్రలు చేస్తోంది :పుష్ప శ్రీవాణి

Pushpa Srivani Opens Grama Sachivalaya Building In Vizianagaram - Sakshi

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాలుగు నెలల్లోనే లక్షా 26వేల ఉద్యోగాలు భర్తీ చేసి చరిత్ర సృష్టించారని ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. కురుపాం నియోజకవర్గ పరిధి కొమరాడ మండలం గంగరేగువలస, గరుగుబిల్లి మండలం రావివలసలో గ్రామసచివాలయాలను గురువారం ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ గాంధీజీ కలలు గన్న గ్రామస్వరాజ్య స్థాపనకే సచివాలయ వ్యవస్థ ఆవిర్భవించిందని చెప్పారు.

సాక్షి, గరుగుబిల్లి(విజయనగరం): రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు ఓ సువర్ణాధ్యాయమని ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. జాతిపిత గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సచివాలయాలతోనే సాధ్యమని దీన్ని గుర్తించే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయ వ్యవస్థకు రూపకల్పన చేశారన్నారు. మండలంలోని రావివలస గ్రామంలో సచివాలయాన్ని గురువారం ఆమె ప్రారంభించారు. అనంతరం ఎంపీడీఓ ఎంవీ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు సచివాలయాలు తోడ్పడతాయన్నారు. వైఎస్సార్‌సీపీ అరకు పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగు లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తే తెలుగుదేశం రాజకీయం చేసేందుకు కుట్రలు పన్నిందన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు. కార్యక్రమంలో వీటీ సూర్యనారాయణ థాట్రాజ్, పార్టీ మండల కన్వీనర్‌ ఉరిటి రామారావు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కె.ధర్మారావు, మాజీ సర్పంచ్‌ ఎం.బలరాంనాయుడు, బాపూజీనాయుడు, గ్రామ ప్రత్యేకాధికారి బి.తిరుపతిరావు, జియ్యమ్మవలస మండల కన్వీనర్‌ మూడడ్ల గౌరీశంకరరావు, నాయకులు కలిశెట్టి ఇందుమతి, బొబ్బిలి అప్పలనాయుడు, ముదిలి గౌరునాయుడు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు రావివలసలో నెలకొన్న సమస్యలను మాజీ సర్పంచ్‌ బలరాంనాయుడు మంత్రికి వివరించారు.

మొక్కలు పర్యావరణ  నేస్తాలు
గరుగుబిల్లి: మొక్కలు పర్యావరణ నేస్తాలని ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు.  మండలంలోని రావివలస సచివాలయ ప్రాంగణంలో పలు రకాల మొక్కలను గురువారం నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భవిష్యత్‌ తరాలకు ప్రాణవాయువు అందించాలంటే ఇప్పటి నుంచే ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. మొక్కల పెంపకం ఆవశ్యకతను మరింతగా ప్రజలకు వివరించాలన్నారు.  కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ అరకు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు,  మండల కన్వీనర్‌ ఉరిటి రామారావు తదితరులు ఉన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top