కూతకు సై

Pro Kabaddi in Visakhapatnam - Sakshi

నేటి నుంచి ప్రొ కబడ్డీ పోటీలు

పోర్ట్‌ స్టేడియంలో రాత్రి 8 గంటల నుంచి మ్యాచ్‌

విశాఖ స్పోర్ట్స్‌: కబడ్డీ కూతకు ఆతిథ్య తెలుగు టైటాన్స్‌ సిద్ధమైంది. ఆరో సీజన్‌ దీటుగానే ప్రారంభించినా మధ్యలో కాస్త తడబాటుతో వెనుకబడింది. హోమ్‌టౌన్‌లోనే టైటాన్స్‌ చెలరేగనుండటంతో ప్లేఆఫ్‌కు చేరుకునే అవకాశాలు నిలిచే ఉన్నాయి. ఈ సీజన్‌లో 12 జట్టు రెండు జోన్‌లుగా తలపడుతున్నాయి. 12 వారాల పాటు సాగనున్న ఈ సీజన్‌లో ఇప్పటికే ఎనిమిది వారాలు అయిపోయాయి. ఇక చివరి నాలుగు వారాల్లో విజేత ఎవరో తేలిపోనుంది. కీలకమైన ఈ లెగ్‌ హోమ్‌టౌన్‌లోనే జరగనుండటంతో తెలుగు టైటాన్స్‌ భవితవ్యం తేలిపోనుంది. ఇంకా తొమ్మిది మ్యాచ్‌ల్లో ఆడాల్సి ఉండగా.. ఇక్కడే ఆరు మ్యాచ్‌లు ఆడనుండటంతో ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తామనే దీమాను తెలుగు టైటాన్స్‌ జట్టు గురువారం జరిగిన మీడియా సెషన్‌లో వ్యక్తం చేసింది. ఏ జోన్‌లో ఆరు జట్లు ఉండగా తొలి రెండు స్థానాల్లో యు ముంబ, ఫార్చున్‌ జెయింట్స్‌ కొనసాగుతున్నాయి. జోన్‌–బిలో తెలుగు టైటాన్స్‌ ఆడుతుండగా తొలి రెండు స్థానాల్లో బెంగళూర్‌ బుల్స్, పాట్నా పైరేట్స్‌ కొనసాగుతున్నాయి.

రైడింగ్‌ నుంచి డిఫెన్స్‌కు...
తెలుగు టైటాన్స్‌ జట్టులో స్టార్‌ ఆటగాడు రాహుల్‌ రైడింగ్‌కు పెట్టింది పేరు. ఇప్పటికే 700 పాయింట్లు సాధించిన తొలి ఆటగాడిగా నమోదయ్యాడు. అయితే రాహుల్‌ను ప్రత్యర్థి జట్లు డిఫెండ్‌ చేయడంతో జట్టులోని మిగిలిన ఆటగాళ్లపై ఆధారపడ్డామని జట్టు సీఈఓ పవన్‌ అంటున్నారు. సీజన్‌లో చావోరేవో తెల్చుకోవల్సిన మ్యాచ్‌ల్లో విజయమే లక్ష్యంగా పోరాడతామంటున్నారు. జట్టు మేనేజర్‌ త్రినాథ్‌ మాట్లాడుతూ ఆట జరిగే రోజును బట్టి వ్యూహాలు మారుతాయంటున్నారు.

హోమ్‌ లెగ్‌ కలిసొచ్చేనా..
జోన్‌–బీలో ఆడుతున్న తెలుగు టైటాన్స్‌ ప్రస్తుత ఆరో సీజన్‌లో ఇప్పటికి పదమూడు మ్యాచ్‌లాడింది. ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి ఏడు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. ఒక మ్యాచ్‌ డ్రాగా ముగించింది. జోన్‌–బీలో ఆడుతున్న ఆరు జట్లలో తెలుగు టైటాన్స్‌ ప్రస్తుతానికి నాలుగో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం జరుగుతున్న లెగ్‌లో తెలుగు టైటాన్స్‌ హోమ్‌టౌన్‌లో ఆడుతున్నందున వరుస విజయాలందుకుంటే ప్లేఆఫ్‌కు చేరే అవకాశాలున్నాయి. అయితే జోన్‌–బీలో కనీసం మూడో స్థానానికైనా చేరుకోవాల్సి ఉంటుంది. విశాఖలో ఆరుమ్యాచ్‌లు ఆడనుంది. బి జోన్‌లోనే టాప్‌–2లో నిలిచిన జట్లతో ఆడాల్సి ఉంది. ఇక ఇదే జోన్‌లో చివరి స్దానంలో కొనసాగుతున్న యోధా జట్టుతోనూ తలపడనుంది. అయితే కలిసి వచ్చే అంశం పూల్‌ఏలో చివరి రెండు స్థానాల్లో నిలిచిన జట్లతోనూ మ్యాచ్‌లున్నాయి.  దీంతో మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించే అవకాశాలున్నాయి.

తెలుగు టైటాన్స్‌ వీరే...
ఆల్‌రౌండర్‌ విశాల్‌ భరద్వాజ్‌ జట్టుకు నాయకత్వం వహిస్తుండగా రైడింగ్‌ దిట్ట రాహుల్‌ ఉండనే ఉన్నాడు. అంకిత్, కమల్, మోసిన్, నీలేష్, రజ్నీష్, రక్షిత్‌లు రైడింగ్‌కు సిద్ధంగా ఉన్నారు. అనుజ్, ఫర్హాద్, సొంబిర్‌ రైట్‌ కవర్‌లో డిఫెండ్‌ చేయనుండగా అనిల్, మనోజ్, దీపక్‌ లెఫ్ట్‌ కవర్‌లో డిఫెండ్‌ చేయనున్నారు. సెంటర్‌లో అబ్జోర్, కృష్ణ ఉండగా అర్మాన్, మహేందర్‌ ఆల్‌రౌండ్‌ ప్రతిభ చూపేందుకు సిద్ధంగా ఉన్నారు.

తప్పులు సరిదిద్దుకుంటున్నాం...
చివరి లెగ్‌ పోటీల్లో డూ ఆర్‌ డైగా తలపడాల్సి ఉంది. హోమ్‌లెగ్‌లో ఆడుతుండటం కలిసివచ్చే అంశమే. కనీసం ఐదు మ్యాచ్‌ల్లో నెగ్గినా ప్లేఆఫ్‌కు చేరుకున్నట్లే. ఇంకా తొమ్మిది మ్యాచ్‌లు ఈ సీజన్‌లో ఆడాల్సి వుంది. సీజన్‌ ప్రారంభంలో బలమైన జట్టుగా ఉన్న తెలుగు టైటాన్స్‌ కాస్తా వెనుకబడింది. తొలి లెగ్‌లో ఆడిన జట్టే ఇక్కడ ఆడనుంది. 18 మందిలో ఏడుగురు సీనియర్లు ఈ పోటీల్లో తలపడనున్నారు.  
– తెలుగు టైటాన్స్‌ కెప్టెన్‌ విశాల్‌ భరద్వాజ్‌

తెలుగు టైటాన్స్‌తో...
7వ తేదీన రాత్రి 8 గంటలకు ఫారŠుచ్యన్‌ జెయింట్స్‌తో
8వ తేదీన రాత్రి 9 గంటలకు పింక్‌ ఫాంథర్స్‌తో
9వ తేదీన రాత్రి 9 గంటలకు హర్యానా స్టీలర్స్‌తో
11వ తేదీన రాత్రి 9 గంటలకు యూపి యోధాతో
12వ తేదీన రాత్రి 9 గంటలకు బెంగళూర్‌ బుల్స్‌తో
13వ తేదీన రాత్రి 8 గంటలకు పాట్నా పైరెట్స్‌తో

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top