
ఎక్కడ నిల్వ చేస్తారు?
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు కొత్త కష్టాలు వచ్చాయి. గోదావరి నది నుంచి నీటిని తరలించడానికి అనుమతి ఉన్నా... ఆ నీటిని ఎక్కడ నిల్వ చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది.
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు కొత్త కష్టాలు వచ్చాయి. గోదావరి నది నుంచి నీటిని తరలించడానికి అనుమతి ఉన్నా... ఆ నీటిని ఎక్కడ నిల్వ చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రాజెక్టు పరిధిలో ఉన్న రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యంపై కేంద్రప్రభుత్వం తాజాగా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ రిజర్వాయర్లతో ప్రాజెక్టు లక్ష్యాన్ని సాధించలేరని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న రిజర్వాయర్ల సామర్థ్యం పెంచడంతో పాటు, కొత్తగా మరికొన్ని రిజర్వాయర్లను నిర్మించాలని కేంద్ర జలవనరుల శాఖ రాష్ట్రప్రభుత్వానికి సూచించింది.
హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని పలు గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు, తెలంగాణలోని ఏడు జిల్లాల పరిధిలోని 16.40 లక్షల ఎకరాలకు సాగునీరు లక్ష్యంగా.. సుమారు రూ. 40 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభించారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఇప్పటికే మేడారం, మిడ్మానేరు, అనంతగిరి, పాములపర్తి, చేవెళ్ల, తిప్పారం వంటి రిజర్వాయర్లను గుర్తించారు. అయితే ప్రాజెక్టులో పేర్కొన్న ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీటిని అందించాలంటే ఈ రిజర్వాయర్ల సామర్థ్యం సరిపోదు.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో మొత్తం 160 టీఎంసీల నీటిని ఉపయోగించుకోవాల్సి ఉంది. ఇందులో 30 టీఎంసీలను హైదరాబాద్కు తాగునీటి కోసం కేటాయించి, ఎల్లంపల్లి నుంచి నేరుగా హైదరాబాద్కు ప్రత్యేక పైప్లైన్లను వేస్తున్నారు. 10 టీఎంసీల నీటిని గ్రామీణ ప్రాంత ప్రజల మంచినీటి అవసరాల కోసం, మరో 16 టీఎంసీలను పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించాలి. మిగిలిన నీటిని పంటల సాగు కోసం ఉపయోగించనున్నారు. హైదరాబాద్కు సంబంధించిన మంచినీటికి మినహా... మిగిలిన నీటిని నిల్వ చేయడం కోసం రిజర్వాయర్లు అవసరం. ప్రాణహిత నది నుంచి వరదలు ఉన్న 90 రోజుల్లో 160 టీఎంసీల నీటిని ఎగువ ప్రాంతానికి తరలించాల్సి ఉంది. దీని ప్రకారం కనీసం 40 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యంగల రిజర్వాయర్ల అవసరం ఉంది. అయితే ప్రస్తుతం గుర్తించిన రిజర్వాయర్ల సామర్థ్యం ఇందులో 50 శాతం కూడా లేదు. దాంతో ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపిన సాగునీటి ప్రణాళిక ప్రతిపాదనలపై సానుకూల నిర్ణయం తీసుకుంటూనే.. రిజర్వాయర్ల సామర్థ్యం పెంపు, కొత్త రిజర్వాయర్ల నిర్మాణం విషయాన్ని జలవనరుల శాఖ ప్రస్తావించింది.
కాగా, ఈ ప్రాజెక్టును 2014 సంవత్సరం లోపు పూర్తి చేయాల్సి ఉంది. గత నాలుగేళ్లుగా పనులు సాగక పోవడంతో ఆ గడువును 2018 వరకు పొడిగించారు.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందే జిల్లాల వివరాలు..
జిల్లా పేరు- ఆయకట్టు (ఎకరాల్లో)
ఆదిలాబాద్- 1,56,500
కరీంనగర్- 1,71,449
నిజామాబాద్- 3,04,500
మెదక్- 5,19,152
నల్లగొండ- 2,29,832
రంగారెడ్డి- 2,46,704
వరంగల్ -11,863
మొత్తం- 16,40,000