కిడ్నీ వ్యాధితో చనిపోయారు
ఒంగోలు ,కందుకూరు రూరల్: ‘అన్న.. మాది కోటపాడు పంచాయతీలోని కల్లూరివారి పాలెం. ఎంతో కాలం నుంచి ఫ్లోరైడ్ నీటితో ఇబ్బందులు పడుతున్నాం. గ్రామంలో ఇద్దరు కిడ్నీ వ్యాధితో చనిపోయారు. బోర్లలో నీరు అడుగంటిపోయాయి. అంతా ఉప్పు నీరే. అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదు’ అంటూ కల్లూరి రాధ తమ గ్రామ సమస్యను వైఎస్ జగన్మోహన్రెడ్డికి విన్నవించారు.
ఇంటికో ఉద్యోగం ఏదీ?:‘ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఇంటికో ఉద్యోగం హామీని తుంగలో తొక్కారు. నేను ఏడేళ్ల క్రితమే బీఈడీ పూర్తి చేశా. మా అమ్మ క్యాన్సర్తో మృతి చెందింది. నాన్న వయోభారంతో ఇంటికే పరిమితమయ్యాడు. ఇద్దరు తమ్ముళ్లు కష్టపడుతూ నన్ను చదివిస్తున్నారు. వికలాంగుల కోటాలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా. ముఖ్యమంత్రి నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాడు.’ అంటూ పొన్నలూరు మండలం చెన్నిపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు అరికిటేకుల అంకయ్య జననేతతో తన ఆవేదనను చెప్పుకున్నాడు. సమస్యను విన్న జగన్.. పార్టీ బాధ్యత తీసుకుని న్యాయం చేస్తుందని అతనికి హామీ ఇచ్చారు.