కష్టకాలంలో ‘కానుక’

Pension Distribution in Andhra Pradesh - Sakshi

ఠంచన్‌గా పింఛన్‌ పంపిణీ

మొదటి రోజే 93 శాతం పూర్తి

లాక్‌డౌన్‌లో లబ్ధిదారులకు ఊరట

కర్నూలు (ఓల్డ్‌సిటీ): పింఛన్‌ ఠంచన్‌గా అందింది. లాక్‌డౌన్‌ ఇబ్బందుల్లోనూ గ్రామ/వార్డు వలంటీర్లు ఒకటో తేదీనే లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి అందజేశారు. కష్టకాలంలో పేదలు, అభాగ్యులను ఆదుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశాన్ని నెరవేర్చారు. “వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక’ కింద సామాజిక పింఛన్ల పంపిణీని బుధవారం తెల్లవారుజాము నుంచే ప్రారంభించారు. సాయంత్రం ఐదు గంటలకు 93 శాతం పంపిణీ పూర్తి చేశారు. రూ.93.50 కోట్ల సొమ్మును 3,92,968 మంది లబ్ధిదారులకు అందించారు. లాక్‌డౌన్‌ కారణంగా బయట పనులు చేసుకోలేకపోతున్న వారికి పింఛన్‌ మొత్తం ఎంతో ఊరట కల్గించింది. డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఎంకేవీ శ్రీనివాసులు కర్నూలులో పింఛన్ల పంపిణీని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. పంపిణీ శాతంలో జిల్లాకు రాష్ట్రంలో నాల్గో స్థానం దక్కిందని ఆయన తెలిపారు. కాగా.. కర్నూలు నగరంలో అన్ని రకాల పింఛన్లు 28,400 ఉండగా..మొదటిరోజే రికార్డుస్థాయిలో 94 శాతం పంపిణీ పూర్తి చేశారు. ఈసారి నెట్‌వర్క్‌ సమస్యలు కూడా లేకపోవడంతో ఉదయం నుంచే పంపిణీ ప్రక్రియ వేగవంతంగా సాగినట్లు నగర పాలక కమిషనర్‌ ఎస్‌.రవీంద్రబాబు తెలిపారు. 

జగన్‌ మా గురించి ఆలోచించారు..
విపత్కర పరిస్ధితుల్లోనూ ఒకటో తేదీనే ఇంటి వద్దకు వచ్చి పింఛన్‌ ఇవ్వడం గొప్ప విషయం. నాకు ఇద్దరు కొడుకులు. ఉపాధి కోసం వేరే ఊరు వెళ్లారు. వారి ముగ్గురు పిల్లలతో ఇంటి వద్దనే ఉంటున్నా. కరోనా వల్ల అన్నీ బంద్‌ చేసిన ఈ సమయంలోనూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మా గురించి ఆలోచించారు. గ్రామ వలంటీర్‌ ఉమ వచ్చి రూ.2,250 పింఛన్‌ మొత్తం ఇచ్చింది. – నరసమ్మ, శివశంకర్‌నగర్, ఆదోని 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top