ప్రజాప్రతినిధుల తీరు సిగ్గు.. సిగ్గు.. | Sakshi
Sakshi News home page

ప్రజాప్రతినిధుల తీరు సిగ్గు.. సిగ్గు..

Published Sat, Jan 3 2015 3:19 AM

Parliamentary pattern .. shame shame ..

కోడి పందాలు వద్దంటూ సీపీఎం ఆందోళన
నరసాపురం అర్బన్ : సంక్రాంతికి కోడి పందాలు నిర్వహించాలంటూ ధర్నాకు సైతం సిద్ధపడిన జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేల తీరు సిగ్గుచేటని సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరామ్ విమర్శించారు. జిల్లాలో కోడిపందాలను అరికట్టాలని కోరుతూ శుక్రవారం సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక టాక్సీస్టాండ్ సమీపంలో అంబేద్కర్ విగ్రహం వద్ద పార్టీ శ్రేణులు ఆందోళన చేశారు. బలరామ్ మాట్లాడుతూ సంక్రాంతి సరదా, సంప్రదాయం పేరుతో ఏటా జిల్లాలోని భీమవరం చుట్టుపక్కల ప్రాం తాల్లో పెద్ద ఎత్తున కోడిపందాలు, పేకాట, గుండాట వంటి జూదాలు నిర్వహిస్తున్నారని చెప్పారు.

వీటిని ప్రజాప్రతినిధులే దగ్గరుండి జరిపిం చడం దారుణమన్నారు. హైకోర్టు తీర్పుతో ఈ ఏడాదైనా విష సంస్కృతికి ముగింపు దక్కుతుందనుకున్నా ఆశాభంగం తప్పనట్టు ఉందన్నారు. ప్రభుత్వం గద్దెనెక్కి ఏడు నెలలు గడుస్తున్నా జిల్లాలో  ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదని ధ్వజ మెత్తారు. నిట్ లాంటి సంస్థలు పక్క జిల్లాకు తరలిపోతుంటే చోద్యం చూస్తున్న నాయకులు జూదాల నిర్వహణకు ఉత్సాహం చూపడం హేయన్నారు.

సీపీఎం డివిజన్ కార్యదర్శి కవురు పెద్దిరాజు మాట్లాడుతూ కోర్టు ఆదేశాలను ధిక్కరించి కోడిపందాల కోసం పట్టుపడుతున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రతినిధుల తీరు సిగ్గు.. సిగ్గు.. అంటూ నాయకులు నినదించారు. పార్టీ పట్టణ కార్యదర్శి ఎం.త్రిమూర్తులు, ఎం.రామాంజనేయులు, కేతి నీడి వెంకటేశ్వరరావు, పొగాకు నా రాయణరావు, ఐద్వా డివిజన్ కార్యదర్శి పి.పూర్ణ, భూడిద భువనేశ్వరి, పొన్నాడ రాము పాల్గొన్నారు.

Advertisement
Advertisement