ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ ప్రకటించకుంటే పోరే | Organized protests at Collectorate | Sakshi
Sakshi News home page

ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ ప్రకటించకుంటే పోరే

Dec 21 2014 2:07 AM | Updated on Apr 4 2019 5:41 PM

రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు 60శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ ప్రకటించకుంటే..

ఒంగోలు టౌన్ : రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు 60శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ ప్రకటించకుంటే ప్రభుత్వంపై రాజీలేని పోరాటం సాగిస్తామని వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండ్రెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. వైఎసాసర్ టీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలయ్యే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న డిప్యూటీ డీఈఓ, ఎంఈఓ, డైట్ లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్ల పోస్టులను అడ్‌హక్ పదోన్నతులతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

వైఎస్సార్ టీఎఫ్‌జిల్లా అధ్యక్షుడు జి.వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం ఉపాధ్యాయులతో చేసుకున్న ఒప్పందం మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుపయోగంగా ఉన్న హెల్త్ కార్డులను అన్ని కార్పొరేట్ ఆస్పత్రులు అనుమతించే విధంగా యాజమాన్యాలతో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి జి.చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎయిడెడ్ ఉపాధ్యాయుల పదవీ విరమణ వయసు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. 398 రూపాయల ప్రత్యేక వేతనంతో పనిచేసిన ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలన్నారు. జిల్లా కోశాధికారి వరిమడుగు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ మునిసిపల్ ఉపాధ్యాయులకు జీపీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు.

జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు కేవీ నారాయణ మాట్లాడుతూ జిల్లాలో పదోన్నతుల షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలన్నారు. గౌరవ సలహాదారు ఎన్.శామ్యూల్ మోజస్ మాట్లాడుతూ ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఏపీటీఎఫ్ నాయకుడు పి.సుబ్బారావు, బీటీఏ నాయకుడు పి.జాలరామయ్యలు ధర్నా శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. కార్యక్రమంలో వైఎస్సార్ టీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్లు డి.శాంతారావు, మాలకొండారెడ్డి, మహిళా కార్యదర్శి మార్తమ్మ, ఉపాధ్యక్షుడు పి.నాగేశ్వరరావు, బి.సురేష్, పి.వెంకటప్పారెడ్డి, కేవీ రమణారెడ్డి, పులి అంజిరెడ్డి, కార్యదర్శులు వి.రామకృష్ణారెడ్డి, వై.తిరుపతిరెడ్డి, డివిజనల్ కార్యదర్శి బీసాబత్తిన శ్రీనివాసరావుతో పాటు అన్ని మండలాలకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి నూర్‌బాషాఖాశింను కలిసి వినతిపత్రం సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement