కమ్యూనిస్టుల మధ్య మాటల యుద్ధం అంతూపొంతూ లేకుండా సాగుతూనే ఉంది.
సాక్షి, హైదరాబాద్: కమ్యూనిస్టుల మధ్య మాటల యుద్ధం అంతూపొంతూ లేకుండా సాగుతూనే ఉంది. లేఖల బాణాలు వేసుకోవడం,ప్రెస్కాన్ఫరెన్సుల్లో దెప్పిపొడుచుకోవడం మానలేదు. కలసి మెలసి ప్రజాసమస్యలపై పని చేస్తామంటూనే పరస్పరం కత్తులు నూరుకోవడాన్ని శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇంకో ఐదారు నెలల్లో ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఈ ‘పోరేమిటని’ పార్టీ శ్రేణులు విస్మయం వ్యక్తంచేస్తున్నాయి. పార్టీ సిద్ధాంతాలపైన, విధివిధానాలపైన, వ్యూహాత్మక ఎత్తుగడలపైన వాదులాడుకోవడం వీరికి కొత్త కాకున్నా మరీ ఇంత ‘దిగజారి’ దూషించుకోవాలా? అని నివ్వెరపోతున్నాయి. గతంలో పార్టీ ప్రణాళికలపై ఉభయ కమ్యూనిస్టులు దుమ్మెత్తిపోసుకున్నారు. ఇటీవల సమైక్యాంధ్ర ఉద్యమం మొదలయినప్పుడు సీపీఐ అనుబంధ కార్మిక సంఘాలు ఆ ఆందోళనకు మద్దతివ్వడం దేనికి సంకేతమంటూ సీపీఎం నేతలు, తెలంగాణలో సీపీఎం గోడమీది పిల్లి వాటాన్ని ప్రదర్శిస్తున్నదంటూ సీపీఐ నేతలు ఒకరిపై ఒకరు కాలుదువ్వుకున్నారు. మళ్లీ ఇప్పుడు ఎన్నికల సర్దుబాట్లపై బజారున పడ్డాయి.
ఎన్నికలొస్తున్న ప్రతిసారీ ఉభయ కమ్యూనిస్టు పార్టీలు పొత్తుల వ్యవహారంలో కాట్లాడుకోవడం షరామామూలైందని, పార్టీ నాయకత్వాలే ఇటువంటి దుస్థితిలో ఉంటే కార్యకర్తల మధ్య సయోధ్య ఎలా సాధ్యమని పార్టీ ద్వితీయశ్రేణి నాయకత్వం వాపోతోంది. సొంతంగా పోటీ చేసి బలాన్ని పెంచుకోవడానికి బదులు ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకోవాలనుకోవడమే తమ పార్టీల బలహీనత అని విశ్లేషిస్తున్నాయి. తాము తప్ప మిగతావన్నీ బూర్జువా పార్టీలేనని చెప్పే కమ్యూనిస్టులు సొంతకాళ్లపై నిలబడడానికి ఇంకెంత కాలం పడుతుందని ప్రశ్నిస్తున్నాయి. 2004లో కాంగ్రెస్తో, 2009లో టీడీపీతో పొత్తులు పెట్టుకుని తప్పు చేశామని పార్టీ రాష్ట్ర మహాసభల్లో విశ్లేషించుకున్న ఉభయ కమ్యూనిస్టులు మళ్లీ ఎన్నికలొచ్చే సమయానికి అదే తప్పు చేస్తున్నాయని ఆయా పార్టీల శ్రేణులు వాపోతున్నాయి. హుందాతనానికి మారు పేరుగా ఉండాల్సిన కమ్యూనిస్టు నేతలు బజారున పడి వాగ్వాదాలకు దిగడం, బహిరంగ లేఖలు రాసుకోవడం వల్ల కిందిస్థాయి కార్యకర్తల మధ్య మరింత దూరం పెరుగుతుందే తప్ప సాధించేదేమీ లేదన్నది నిర్వివాదాంశం. వాస్తవానికి ఈ రెండు పార్టీల మధ్య పార్టీల విలీనం నుంచి రాష్ట్ర విభజన వరకు అనేక అంశాలపై భిన్నాభిప్రాయాలున్నాయి. అనేక సందర్భాలలో వీటి మధ్య విభేదాలు బయటపడ్డాయి కూడా. విశాల ప్రాతిపదికన ఐక్య వేదికలు నిర్మించాలని రెండు పార్టీలూ సూత్రప్రాయంగా నిర్ణయించాయి. ఈమేరకు కొన్ని అంశాలపై కలిసి పని చేశాయి. అయినప్పటికీ పరస్పరం విశ్వసించుకోకపోవడంతో ఒకరిపై ఒకరికి ఏర్పడ్డ అపనమ్మకం విపరీత పరిణామాలకు దారితీస్తోంది.