ఒక్కరోజు ముచ్చటే | not reached singur water to andile big canal | Sakshi
Sakshi News home page

ఒక్కరోజు ముచ్చటే

Feb 14 2014 11:55 PM | Updated on Nov 9 2018 6:05 PM

డిప్యూటీ సీఎం అట్టహాసంగా ప్రారంభించిన సింగూరు ఎత్తిపోతల పథకం ఒక్కరోజు ముచ్చటగా మిగిలిపోయింది.

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: డిప్యూటీ సీఎం అట్టహాసంగా ప్రారంభించిన సింగూరు ఎత్తిపోతల పథకం ఒక్కరోజు ముచ్చటగా మిగిలిపోయింది. సిరులు పండించాల్సిన సింగూరు నీరు రైతన్నల ఆశలపై నీళ్లు చల్లింది. సాక్షి చెప్పినట్టుగానే అసంపూర్తిగా నిర్మించిన కాల్వలు నీటి ప్రవాహ ఉధృతికి తట్టుకోలేక ఎక్కడికక్కడ తెగిపోయాయి. దీంతో నీటి ప్రవాహ దిశ మారి పంట పొలాలు నీటమునిగాయి. నీటి ప్రవాహ దిశను ఆందోల్ చెరువు వైపునకు మళ్లించేందుకు  చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో అధికారులు గేట్లు మూసివేశారు.

 ఎక్కడిక్కడ తెగిపోయిన కాల్వలు
 డిప్యూటీ సీఎం సి.దామోదర రాజనర్సింహ గురువారం మధ్యాహ్నం సింగూరు జలాల ట్రయల్న్‌న్రు ప్రారంభించగా, అధికారులు ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాల్వ గుండా అందోల్ చెరువుకు నీళ్లు వదిలారు. 12 గంటల పాటు పారిన నీరు దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న అందోల్ మండలం మాసానిపల్లి వరకు చేరింది. అయితే మాసానిపల్లి నుంచి ప్రధాన కాల్వ లేకపోవడం తో అధికారులు పిల్ల కాల్వల్లోకి సింగూరు నీటిని మళ్లిం చారు. ఈ పిల్ల కాల్వలు కూడా అసంపూర్తిగానే ఉండటంతో నీటి ప్రవాహ ఉధృతి తట్టుకోలేక కాల్వలు ఎక్కడికక్కడ తెగిపోయాయి.

 నీళ్లు పంట పొలాలు, బీడు భూముల్లోకి ప్రవహించాయి. గురువారం రాత్రంతా సింగూరు జలం వృథాగానే పోయింది. శుక్రవారం  ఉదయం గుర్తించిన  స్థానికులు అధికారులకు సమాచారం చేరవేశారు. వెంటనే రంగప్రవేశం చేసిన కాంట్రాక్టర్లు కాల్వలకు మరమ్మతులు చేసే ప్రయత్నం చేశారు. జేసీబీలను తెప్పించి  కాల్వల మధ్యలో నిర్మించిన సిమెంట్ దిమ్మెలను ధ్వంసం చేశారు. అనంతరం కట్టలు తెగిపోయిన చోట మట్టితో పూడ్చేందుకు ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోవడంతో నీరు మాసానిపల్లికిచెందిన కొమరయ్య అనే రైతు వరి పొలం మీదగా పారి డాకూరు కట్టు కాల్వల్లోకి మళ్లింది. దీంతో కొరమయ్యకు చెందిన 4 ఎకరాల వరిపంట పూర్తిగా నీట మునిగింది. మరోవైపు డాకూరుకుకట్టుకాల్వలోకి భారీగా  నీరు చేరడంతో ఆప్రాంతంలోని కాల్వకు పలుచోట్ల గండిపడింది.

 గేట్లు మూసివేత
 అందోల్ పెద్ద చెరువు వైపు వెళ్లాల్సిన సింగూరు నీరు దిశ మారి పంటపొలాల మీద ప్రవహిస్తుండటంతో ఏం చేయాలో తోచక అధికారులు తలపట్టుకున్నారు. ప్రవాహ ఉధృతి ఇలాగే కొనసాగితే సమీప గ్రామాలు నీటమునగడం ఖాయమని నిర్ధారించుకున్న ఆధికారులు ముందు జాగ్రత్త చర్యగా సింగూరు గేట్లు మూసివేశారు. అయినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బీడు భూములను సస్యశ్యామలం చేస్తుందనుకున్న సింగూరు జలం రైతన్నల రెక్కల కష్టాన్ని వృథా చేసింది.  కాల్వల నిర్మాణం పనులు పూర్తి కాకముందే నీళ్లు వదలటం వల్లే ఈ పరిస్థితి తె లెత్తింది.  దీంతో ‘సింగూరు’ కథ మళ్లీ మొదటికి వచ్చింది. ప్రస్తుతం మరో ఏడాది గడిస్తే తప్ప రైతన్నలకు సింగూరు నుంచి నీళ్లు వచ్చే అవకాశం లేకుండా పోయింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement