టీడీపీ నేత సోదరుని కుమారుడు పై నిర్భయ కేసు

టీడీపీ నేత సోదరుని కుమారుడు పై  నిర్భయ కేసు - Sakshi


 నిందితుడు టీడీపీ నేత సోదరుని కుమారుడు


  •  మారేడుపల్లి పీఎస్‌లో లైంగిక దాడి కేసు

  •  మాఫీ చేయించేందుకు మాజీ మంత్రి ద్వారా యత్నం

  •  కర్నూలులో తెలంగాణ పోలీసుల తిష్ట


హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు సోదరుడు సోమిశెట్టి ప్రకాష్ కుమారుడు సోమిశెట్టి హరికృష్ణ కోసం తెలంగాణ రాష్ట్ర పోలీసులు కర్నూలులో తిష్ట వేశారు. హైదరాబాద్ మారేడుపల్లిలోని శివఅరుణ కాలనీలో నివాసం ఉంటున్న ఓ యువతిపై లైంగికదాడికి పాల్పడినట్లు హరికృష్ణపై ఈనెల 11న వెస్ట్ మారేడుపల్లి పోలీసుస్టేషన్‌లో నిర్భయ చట్టం కింద కేసు (క్రైం నెం.172/2014, తేదీ.11.06.2014) నమోదైంది. నిందితుని ఆచూకీ కోసం మారేడుపల్లి పోలీస్‌స్టేషన్ అదనపు ఇన్‌స్పెక్టర్ నరహరి నేతృత్వంలో రెండు బృందాలు గాలిస్తున్నాయి.

 

హరికృష్ణ కొంతకాలంగా హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్నట్లు సమాచారం అందడంతో రెండు పోలీసు బృందాలు అతని కోసం తీవ్రంగా గాలించాయి. అజ్ఞాతంలోకి వెళ్లినట్లు స్నేహితుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు కర్నూలులో ఆరా తీస్తున్నారు. ఇన్‌స్పెక్టర్ నరహరి కర్నూలులోనే తిష్ట వేసి నిందితుని కోసం గాలిస్తున్నట్లు సమాచారం. కేసును మాఫీ చేయించుకునేందుకు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ద్వారా పోలీసు శాఖ ఉన్నతాధికారులపై టీడీపీ నాయకుడు ఒత్తిడి పెంచినట్లు సమాచారం. రెండు రోజుల క్రితం ఈ కేసు విషయంపై టీడీపీ నేత హైదరాబాద్‌కు వెళ్లి మాజీ మంత్రి ద్వారా తీవ్రంగా ఒత్తిడి చేసినప్పటికీ పోలీసులు అరెస్టు చేసేందుకే సిద్ధపడటం గమనార్హం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top