వైఎస్ రాజశేఖరరెడ్డి చేతిలో రెండుసార్లు చావుదెబ్బతిన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాజకీయ జీవితం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతిలో పూర్తిగా ముగియనుందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు.
కొయ్యలగూడెం , న్యూస్లైన్ : వైఎస్ రాజశేఖరరెడ్డి చేతిలో రెండుసార్లు చావుదెబ్బతిన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాజకీయ జీవితం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతిలో పూర్తిగా ముగియనుందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. కొయ్యలగూడెంలో వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన పోలవరం నియోజ కవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎలాగూ రాజకీయ సమాధి తప్పదని తెలిసిన చంద్రబాబు మహానేత వైఎస్ కుటుంబంపై అవాకులు, చవాకులు పేలుతూ పబ్బం గడుపుకుంటున్నారని చెప్పారు. పిల్లనిచ్చిన పాపానికి నోరుమెదపలేని స్థితిలో బాలకృష్ణ ఉండగా, ఎన్టీఆర్ కుటుంబంలో ఏ ఒక్కరైనా టీడీపీలో మనగలుగుతున్నారా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన దగ్గుబాటి పురందేశ్వరికి రాజకీయ జీవితం ప్రసాదించిన మహోన్నత వ్యక్తి వైఎస్సార్ అయితే, సొంత తమ్ముడు రామ్మూర్తినాయుడికి రాజకీయ సమాధి కట్టిన ఘనత అతని అన్న చంద్రబాబుదని అంబటి ధ్వజమెత్తారు. పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ... విభజించి పాలించు అనే ఆంగ్లేయుల సిద్ధాంతాన్ని సోనియాగాంధీ పాటిస్తూ రాష్ట్ర విభజనకు వంతపాడి తనలో కూడా తెల్లవారి రక్తం ఉందని నిరూపించుకున్నారని ఎద్దేవా చేశారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మహానేత వైఎస్సార్ లక్ష్యమని, దానిని పూర్తి చేయటమే వైసీపీ లక్ష్యమని చంద్రశేఖర్ అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేస్తే తెలం గాణ ఇవ్వడం ఎవరి తరం కాదన్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమానికి జాతీయ నేతల మద్దతు కూడగట్టడంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సఫలమవుతున్నారని పే ర్కొన్నారు. పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు, జిల్లా అధికార ప్రతినిధి తాడికొండ మురళీకృష్ణ, మండల కన్వీనర్ ఎస్ఆర్ఆర్ నరసింహరాజు, నాయకులు పోతన శేషు, చిన్నం గాంధీ, జిల్లా ఎస్టీ సెల్ కన్వీనర్ కోర్సా వెంకటేశ్వరరావు, విద్యార్థి విభాగం నాయకులు కె. కృష్ణస్వరూప్, పి. శ్రీనివాస్, కె.నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.