కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఒంటిపై కిరోసిన్ పోసుకుని, తన పిల్లలపై కూడా పోసి ఆత్మహత్యాయత్నం చేసింది.
జోగిపేట, న్యూస్లైన్: కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఒంటిపై కిరోసిన్ పోసుకుని, తన పిల్లలపై కూడా పోసి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో వివాహిత తీవ్రంగా గాయపడగా, ఆమె బిడ్డలిద్దరూ స్వల్పంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం జోగిపేటలో జరిగింది. ఎస్ఐ ముఖీద్పాష, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... సదాశివ పేటకు చెందిన పద్మావతి(26), స్థానిక స్థానిక గౌని ఏరియాలో నివాసం ఉంటున్న సంతోష్ను 7 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి మణికంఠ (6), కారుణ్య (4)లు సంతానం. కొన్నాళ్ల పాటు సజావుగా సాగిన వీరి సంసారంలో ఇటీవల కలతలు తలెత్తాయి. ఈ కారణంగానే దంపతులు తరచూ గొడవపడేవారు. ఈ క్రమంలోనే కుటుంబ కలహాలతో మనస్థాపం చెందిన పద్మావతి ఆదివారం సాయంత్రం తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని తన చిన్నారులపై కూడా పోసింది. అనంతరం ఆమె నిప్పుపెట్టుకుంది. అయితే చిన్నారులిద్దరూ దూరంగా వెళ్లడంతో వారిపై నిప్పుపడలేదు.
తల్లి మంటల్లో కాలిపోతుండడం చూసిన చిన్నారులు ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నించగా పద్మావతి వారిని పక్కకు తోసివేసింది. అయినప్పటికీ చిన్నారులిద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. ఇది గమనించిన ఇరుగుపొరుగు వారు వెంటనే మంటలను ఆర్పివేసినప్పటికీ పద్మావతి తీవ్రంగా గాయపడింది. దీంతో వారు ఆమెను ఆటోలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్లోని గాంధీకి తరలించారు. అంతకుముందు స్థానిక ఆస్పత్రిలో స్థానిక మున్సిఫ్ మెజిస్ట్రేట్ రమాకాంత్ తీవ్రంగా గాయపడ్డ పద్మావతి వాగ్మూలాన్ని రికార్డు చేశారు. కాగా, తమ బిడ్డ ఆత్మహత్యాయత్నానికి ఆమె భర్త వేధింపులే కారణమని పద్మావతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.