చంద్రబాబు ఇచ్చినమాట నిలబెట్టుకో: మోహన్‌ బాబు | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఇచ్చినమాట నిలబెట్టుకో: మోహన్‌ బాబు

Published Sat, Mar 2 2019 12:13 PM

Mohan Babu demands chandrababu to fee reimbursement for students - Sakshi

సాక్షి, తిరుపతి : ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయారని సీనియర్‌ నటుడు, శ్రీ విద్యానికేతన్‌ సంస్థల అధినేత మోహన్‌ బాబు అన్నారు. ఆయన శనివారమిక‍్కడ మాట్లాడుతూ... ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినా పట్టించుకోలేదని తెలిపారు. ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రవేశపెట్టారు. అప్పట్లో కోట్లాదిమంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. సీఎం చంద్రబాబు అంటే నాకు ఇష్టం. అయినా మాకు ఫీజు బకాయిలు చెల్లించలేదు. చంద‍్రబాబు అనేకసార్లు మా కాలేజీకి వచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ 2014 నుంచి 2018 వరకూ రూ.19 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. చదవండి...(ఆస్తులు తాకట్టుపెట్టి కాలేజీని నడపాల్సి వస్తుంది!)

నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు. బకాయిలపై సీఎంకు చాలాసార్లు లేఖలు రాశాను. 2017-2018 సంవత్సరంలో కొత్త నిబంధనలు పెట్టారు. మూడు నెలలకు ఓసారి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లిస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకూ బకాయిలు చెల్లించలేదు. భిక్షం వేసినట్లు కొద్దిగా ఇస్తున్నారు. ఇలాగైతే విద్యార్థులు ఎలా చదవాలి. అధ్యాపకులకు జీతాలు ఎలా చెల్లించాలి. చంద్రబాబు నీవు ఇచ్చిన మాట నిలబెట్టుకో. దాదాపు రూ.19 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఎంతకాలం ఇలా?. నాకు ఏ కులం లేదు, నేను అందరివాడిని. నాణ్యత లేని విద్యను నేను ఇవ్వను. మా విద్యాసంస్థలలో ర్యాగింగ్‌ ఉండదు. నేను రాజకీయం కోసం మాట్లాడలేదు. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. లేకుంటే మరింత ఆందోళనకు సిద్ధం.’  అని మోహన్‌ బాబు స్పష్టం చేశారు.

Advertisement
Advertisement