అయిపోయిన పెళ్లికి బాజాలు కొట్టకు పవన్
సాక్షి, విజయవాడ : జనసేన అధినేత పవన్ కల్యాణ్పై రాష్ట్ర దేవదాయ శాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయిపోయిన పెళ్లికి బాజాలు కొట్టకండి పవన్ అంటూ ఎద్దేవా చేశారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పురోహితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదివరకే ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం సాయం ప్రకటించిన తరువాత కూడా వారిని ఆదుకోవాలంటూ పవన్ కల్యాణ్ ఇటీవల ఓ ప్రకటన విడుదల చేశారు. దీనిపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పురోహితులపై పవన్ కల్యాణ్ కపట ప్రేమ చూపుతున్నారని మండిపడ్డారు. (‘నీచ రాజకీయాలు ఇప్పటికైనా మానుకోవాలి’)
‘ఇదివరకే సాయం ప్రకటించాకా మళ్లీ డిమాండ్ ఏంటండీ పవన్ కల్యాణ్.. కామెడీ కాకుంటే..’ అంటూ ఎద్దేవా చేశారు. లక్షల పుస్తకాలు చదివి ఉన్నమతి పోయిందా అని ప్రశ్నించారు. హైదరాబాదులో కూర్చున్న పవన్ కళ్లకు సంక్షేమ పథకాల పంపిణీ కనబడటం లేదేమో అని అన్నారు. పార్ట్ టైం రాజకీయాలు చేసే ప్యాకేజీ పవన్ కళ్యాణ్ నిద్ర లేచిన తర్వాత నిజాలు తెలుసుకొని మాట్లాడటం మంచిదని సూచించారు.
గురువారం విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లంపల్లి మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ది మనసున్న ప్రభుత్వం. బ్రాహ్మణులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఈనెల 19వ తేదీ సంక్షేమ పథకాలకు క్యాలెండర్ను సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. అందులో మే నెల 26న అర్చకులకు ఐదు వేల రూపాయల చొప్పున సాయం అందిస్తున్నట్లు తెలిపారు. రాజకీయ మనుగడ కోసం మే 20వ తేదీన పవన్ కల్యాణ్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రజలందరికీ నాలుగు విడుదల రేషన్ పంపిణీ చేసింది.’ అని అన్నారు.