చంద్రబాబుకు మంత్రి అవంతి సవాల్‌ | Minister Avanthi Srinivas Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు టీడీపీ కుట్ర

Feb 28 2020 12:27 PM | Updated on Feb 28 2020 2:24 PM

Minister Avanthi Srinivas Fires On Chandrababu - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ‘పులివెందుల నుంచి ఒక్కరు వచ్చినట్లు నిరూపించకపోతే.. చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా’ అంటూ మంత్రి అవంతి శ్రీనివాస్‌ సవాల్‌ విసిరారు. ఆయన నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమన్నారు. ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన  మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు తన స్వార్థం కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుకి ప్రభుత్వం పూర్తిగా రక్షణ కల్పించిందని.. పోలీసులపై చంద్రబాబు,లోకేష్‌ విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు. పోలీసులు చట్టానికి లోబడే పనిచేస్తారని తెలిపారు. ఇళ్లకి వచ్చి దౌర్జన్యాలు చేస్తామని లోకేష్‌ అనడం దారుణమన్నారు. ఆయన వ్యాఖ్యల వల్లే ఉత్తరాంధ్ర ప్రజలు చంద్రబాబును అడ్డుకున్నారని పేర్కొన్నారు. అన్ని జిల్లాలు, ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అవంతి చెప్పారు.(ఉరిమిన ఉత్తరాంధ్ర)

ఆ విషయంపై తేల్చిచెప్పాలి..
విశాఖ పరిపాలన రాజధానికి టీడీపీ ఎమ్మెల్యేలు మద్దతు తెలుపుతారో లేదో తేల్చి చెప్పాలన్నారు. విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు అమరావతికే మద్దతు తెలిపితే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు దుర్మార్గపు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ‘‘చంద్రబాబు దుర్మార్గపు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. ఆయనపై ఉత్తరాంధ్ర ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. మండు టెండలో ఆరు గంటల పాటు ప్రజలు ధర్నా చేశారు. పోలీసులు, మహిళలపై చంద్రబాబు తీరు దారుణంగా ఉంది. లోకేష్‌ సభ్యత లేకుండా మాట్లాడుతున్నారని’’ అవంతి శ్రీనివాస్‌ తీవ్రంగా దుయ్యబట్టారు. మండలిలో ‘మూడు రాజధానుల బిల్లుల’ను టీడీపీ వ్యతిరేకించడంపై ఉత్తరాంధ్ర ప్రజలు ఆవేశంగా ఉన్నారన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకులని చంద్రబాబు అనుకున్నారని..కానీ ఇది ఉద్యమాలకు పుట్టినిల్లు అని అవంతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. (ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు)

Advertisement
 
Advertisement
Advertisement