అమ్మలా ప్రేమను పంచి, నాన్నలా భద్రత కల్పించాల్సిన ఆ మహిళా అధికారి తీరుతో విసిగి, వేశారిన విద్యార్థినులు నిశిరాత్రి రోడ్డెక్కారు. ఓ మహిళా
అర్ధరాత్రి రోడ్డెక్కిన ఆడపిల్లలు
Nov 29 2013 4:18 AM | Updated on Sep 2 2017 1:04 AM
అమ్మలా ప్రేమను పంచి, నాన్నలా భద్రత కల్పించాల్సిన ఆ మహిళా అధికారి తీరుతో విసిగి, వేశారిన విద్యార్థినులు నిశిరాత్రి రోడ్డెక్కారు. ఓ మహిళా అధికారై ఉండి....బాలికలు పడే ఇబ్బందులను అర్థం చేసుకోవలసింది పోయి అసభ్యంగా మాట్లాడడంతో వారు భరించలేకపోయారు. ఆమె, అక్కడి సిబ్బంది వేధింపులు తాళలేకపోయారు. తిండి మాట అటుంచి కనీసం మెన్సెస్ ప్యాడ్స్ కూడా ఇవ్వకపోవడంతో తమ బాధను ఎవరితోనూ చెప్పుకోలేక బిక్కుబిక్కుమంటూ బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత 2 గంటల సమయంలో హాస్టల్ నుంచి బయటపడి మూడు కిలోమీటర్లు నడిచి, అక్కడ నుంచి పార్వతీపురం బస్టాండ్కు చేరుకున్నారు. 18 మంది విద్యార్థినులు అర్ధరాత్రి హాస్టల్ దాటినా ఎవరూ పట్టించుకోలేదు.
బెలగాం / గుమ్మలక్ష్మీపురం, న్యూస్లైన్: గుమ్మలక్ష్మీపురం మండలంలోని మారుమూ ల గిరిజన గ్రామమైన పి.ఆమిటి ఆశ్రమ పాఠశాల సంక్షేమాధికారి సరస్వతి, అక్కడి వంట, ఇతర సిబ్బంది తమ జీవితాలతో ఆటలాడుకుంటున్నారని, పురుగులన్నం పెడుతున్నారని, తినలేకపోతున్నామని ఇదేమని ప్రశ్నిస్తే తీవ్ర భయాందోళన లకు గురిచేస్తున్నారని విద్యార్థినులు చెప్పా రు. మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని, అసభ్యంగా మాట్లాడుతూ మానసికంగా వేధిస్తున్నారని, గత్యంతరం లేకే తాము హాస్టల్ నుంచి బయటకు రావలసి వచ్చిందని పదో తరగతి చదువుతున్న మండంగి రూప, కె.స్వాతి, కె.షర్మిల, జి.మౌనిక, ఎ.రోహిణి, పి.దీపిక, టి.శిరీష, జి.శ్రీలత, కె.స్వాతి, కె.రజిని, టి.మల్లేశ్వరి తదితర 18 మంది విద్యార్థినులు విలేకరుల ఎదుట వాపోయారు.
పార్వతీపురం బస్టాండ్కు చేరుకున్న విద్యార్థినులు తమ పరిస్థితిని ఫోన్ చేసి ఎస్ఎఫ్ఐ నాయకులకు వివరించా రు. దీంతో హుటాహుటిన ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎ.అశోక్తో పాటు ఎస్ఎఫ్ఐ నాయకులు పార్వతీపురం ఆర్టీసీ బస్టాండ్లో ఉన్న విద్యార్థినుల వద్దకు గురువారం వేకువ జామున చేరుకున్నారు. వారిని పట్టణంలోని ఎస్ఎఫ్ఐ కార్యాలయానికి తీసుకువెళ్లి ఆశ్ర యం కల్పించి ఆదుకున్నారు. అనంతరం విద్యార్థినులు ఎస్ఎఫ్ఐ నాయకులతో కలిసి ఐటీడీఏ పీఓ రజత్కుమార్ సైనీ చాంబర్కు వెళ్లి ఫిర్యాదుచేశారు. స్పందించిన ఆయన తన చాంబర్లో విద్యార్థుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. వారిని సముదాయించిన ఆయన, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చి రెండు రెండు కారుల్లో తిరిగి హాస్టల్కు పంపించారు. ఈ సందర్భంగా పీఓ విలేకర్లతో మాట్లాడుతూ ఈ ఘటనపై విచారణ జరుపుతామని, నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తరగతుల బహిష్కరణ
18 మంది విద్యార్థినులు బయటకు వెళ్లిపోవడంతో మిగిలిన విద్యార్థినులంతా ఫలహారా లు మానివేసి, తరగతులు బహిష్కరించి పాఠశాల ఆవరణలో బైఠాయించారు. పీఓ ఆదేశాల మేరకు గురువారం పాఠశాలకు చేరుకున్న ఏటీడబ్ల్యూఓ శ్రీనివాసరావు ఆశ్రమ పాఠశాల విద్యార్థినులతో మాట్లాడి, వివరాలు సేకరించి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటానని హమీ ఇచ్చి విద్యార్థినులందర్నీ భోజనాలకు పంపారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ ఆశ్రమ పాఠ శాలలో గత కొన్ని రోజులుగా నాణ్యమైన భోజనం పెట్టడం లేదని, పురుగులతో కూడిన అన్నం, కూరలు పెడుతున్నారని, తమకు వచ్చిన పుస్తకాలు, దుప్పట్లు, ట్రంకు పెట్టెలు, బియ్యం తదితరవి అమ్మేస్తున్నారని తెలిపారు. 8,9,10వ తరగతుల విద్యార్థినులకు గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పి ఒక్కొక్కరి వద్ద నుంచి 50 రూపాయలు, 3 నుంచి 7వ తరగతి విద్యార్థులను నుంచి 30 రూపాయల చొప్పున వసూళ్లు చేశారని, అయినా నేటికి గుర్తింపుకార్డులు ఇవ్వలేదని ఆరోపించారు.
మేట్రిన్ను సస్పెండ్ చేయాలి.
పి.ఆమిటి బాలికల ఆశ్రమ పాఠశాలలో మేట్రిన్గా పనిచేస్తున్న నెల్లి సరస్వతిని వెంటనే సస్పెండ్చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎ. అశోక్, జీఎస్యూ జిల్లా అధ్యక్షుడు పి. సురేష్ ఎస్ఎఫ్ఐ మండల నాయకులు అశోక్, సుబ్బారావులు డిమాండ్ చేశారు.
పురుగులన్నమే తింటున్నాం
ఆశ్రమ పాఠశాలలో ప్రతి రోజూ పురుగుల అన్నమే తింటున్నాం. వంటవారిని, వసతి గృహ అధికారిని అడిగినా పట్టించుకున్న పాపానపోలేదు. తమను అసభ్యకరంగా తిడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. - కె.రజిని, పదోతరగతి
వార్డెన్ పట్టించుకోకపోవడం వల్లే..
వసతి గృహంలో సమస్యలు తీర్చాలని పలుమార్లు వార్డెన్ను కోరినప్పటికీ పట్టించుకోకపోవడం వల్లే బుధవారం రాత్రి కాలినడకన మూడుకిలోమీటర్లు నడిచి ఆమిటి జంక్షన్ వరకు వెళ్లి అక్కడి నుంచి ఐటీడీఏ కార్యాలయానికి వెళ్లి పీఓకు ఫిర్యాదు చేశాం. - కె.ఝాన్సీరాణి, పదో తరగతి
Advertisement
Advertisement