కాపీయింగ్‌కు చెక్ | mass copying | Sakshi
Sakshi News home page

కాపీయింగ్‌కు చెక్

Mar 11 2014 4:08 AM | Updated on Sep 2 2017 4:33 AM

కాపీయింగ్‌కు చెక్

కాపీయింగ్‌కు చెక్

ముల్లును ముల్లుతోనే తీయాలన్న సూత్రాన్ని అమలు చేస్తోంది ఇంటర్ బోర్డు.

ముల్లును ముల్లుతోనే తీయాలన్న సూత్రాన్ని అమలు చేస్తోంది ఇంటర్ బోర్డు. సాంకేతిక పరిజ్ఞానంతో మాస్ కాపీయింగ్‌కు పాల్పడాలనుకున్న వారికి అదే సాంకేతిక పరిజ్ఞానంతో అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం అన్ని ఇంటర్మీడియెట్ పరీక్షా కేంద్రాల్లో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్) సెల్ ట్రాకింగ్ సిస్టమ్‌ను అందుబాటులోకి తేనుంది.
 

రీక్ష ప్రారంభమైన క్షణాల్లోనే ప్రశ్నపత్రాలు బయట ప్రత్యక్షమవటం.. సెల్‌ఫోన్ల ద్వారా ప్రశ్నలు బయటకు చేరవేస్తూ మాస్ కాపీయింగ్‌కు పాల్పడటం.. ర్యాంకుల కోసం పాకులాడే కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా చేసే చర్యలివి. దీని ఫలితంగా కష్టపడి చదివిన విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు సెల్‌ట్రాకింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చి మాస్‌కాపీయింగ్‌కు అడ్డుకట్ట వేయాలని ఇంటర్మీడియెట్ బోర్డు భావిస్తోంది. ఈ నెల 12 నుంచి ఏప్రిల్ ఒకటి వరకు ఇంటర్ పరీక్షలు      జరగనున్నాయి. వీటిని పకడ్బందీగా నిర్వహించేందుకు బోర్డు సిద్ధమైంది. ఈ మేరకు ఇప్పటికే ఆయా పరీక్షా కేంద్రాల సూపరింటెండెంట్లు, ఇతర అధికారులకు ఉన్నతాధికారులు సమాచారం అందించారు.

 పనితీరు ఇలా...

 ప్రతి ఇంటర్ పరీక్ష కేంద్రంలో జీపీఎస్ సిస్టం ఏర్పాటుచేసి హైదరాబాద్‌లో ఉన్న ఇంటర్ బోర్డుకు అనుసంధానం చేస్తారు. దీని ద్వారా ఆ సెంటర్‌కు వంద మీటర్ల దూరంలో ఉన్నవారు సెల్‌ఫోన్ల ద్వారా ఎవరెవరితో మాట్లాడుతున్నారనే సమాచారం ఇంటర్ బోర్డుకు అందుతుంది.
 దీనిద్వారా ఏ సెంటర్‌లో ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతుంది. ఈ విధానం వల్ల ప్రతిభ గల విద్యార్థులకు న్యాయం జరుగుతుందని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.
 మాస్‌కాపీయింగ్ అరికట్టేందుకే..
 - కె.వెంకట్రామయ్య, ఆర్‌ఐవో

జిల్లాలో 159 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నాం. వంద శాతం మేర అన్ని సెంటర్లలో జీపీఎస్ నిఘా ఉంటుంది. ఈ విధానం డీజీపీ పర్యవేక్షణలో ఉంటుంది. జీపీఎస్ పరికరాలు ఎక్కడ అమర్చారనేది కూడా తెలుసుకోవటం కష్టం. ఈ విధానం ద్వారా పూర్తిగా పారదర్శకంగా ఎటువంటి కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పరీక్షలు నిర్వహిస్తాం. ఎవరైనా కాపీయింగ్‌కు ప్రయత్నించినట్లు తెలిస్తే వారిపై క్రిమినల్ కేసులు పెడతాం. సంబంధిత సెంటర్ల సూపర్‌వైజర్లను బాధ్యుల్ని చేసి సస్పెండ్ చేస్తారు. అందుకే సూపర్‌వైజర్లుగా ప్రభుత్వ శాఖలకు చెందినవారిని మాత్రమే నియమిస్తున్నాం.

Advertisement
 
Advertisement
Advertisement