మాటలు ఘనం.. చేతలు శూన్యం

Kondapi MLA Swamy Did Not Fulfil His Promises - Sakshi

టీడీపీ హయాంలో మత్స్యకారులకు మొండిచేయి

ఒక్క హామీని నెరవేర్చకపోయిన ఎమ్మెల్యే స్వామి

చేపల మార్కెట్‌పై అలివిమాలిన నిర్లక్ష్యం

అంతన్నారు..ఇంతన్నారు..అది చేస్తాం..ఇది చేస్తామంటూ ఎన్నో హామీలిచ్చారు. తీరా మళ్లీ ఎన్నికలకు వచ్చే నాటికి ఏం చేశారంటే చేసింది శూన్యం. ఐదేళ్ల టీడీపీ పాలనలో మత్స్యకారుల అభివృద్ధి చేసింది ఏం లేదు.  బోట్‌ ల్యాండింగ్, చేపల మార్కెట్, హేచరీ, రెసిడెన్షియల్‌ స్కూల్‌ అంటూ ఎన్నో హామీలిచ్చిన స్థానిక ఎమ్మెల్యే స్వామి ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయారు. తమ సమస్యలపై నిర్లక్ష్యం వహించిన ప్రభుత్వ తీరుపై మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి, సింగరాయకొండ (ప్రకాశం): మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఊదరగొట్టే ప్రభుత్వం ఈ ఐదేళ్లలో వారి కోసం చేసింది శూన్యమనే చెప్పాలి. ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే స్వామి మా గురించి ఏనాడూ పట్టించుకోలేదని స్థానిక మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బోట్‌ ల్యాండింగ్, చేపల హేచరీ ఎక్కడ..?
మండలంలోని మత్స్యకారుల కోసం సుమారు రూ.3 కోట్ల అంచనా వ్యయంతో బోట్‌ ల్యాండింగ్‌ సదుపాయం, సుమారు కోటి రూపాయల అంచనా వ్యయంతో చేపల హేచరీ ఏర్పాటు చేస్తానని సుమారు ఏడాది క్రితం హడావుడి చేశారు. ఈ రెండు పాకల పల్లెపాలెం వద్ద ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. అయితే చేపల హేచరీ ఏర్పాటుచేస్తే ఉన్న కాస్త ఇంటిస్థలం హేచరీకి పోతుందని పల్లెపాలెం మత్స్యకారులు హేచరీ ఏర్పాటుకు నిరాకరించారు. అయితే పక్కనే ఉన్నపోతయ్యగారి పట్టపుపాలెం మత్యకారులు ఆ హేచరీ మా ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరారు. అయితే ఆ ప్రాంతంలో ఏర్పాటుకు ఎమ్మెల్యే స్వామి పట్టించుకోలేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. చివరికి ఈ రెండు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయకుండానే పక్క జిల్లాలకు తరలిపోయాయి.

తీవ్ర తాగునీటి ఎద్దడి
మత్స్యకార పాలెంలో తీవ్ర నీటి ఎద్దడి ఉంది. సుమారు 6 నెలలుగా పాకల పల్లెపాలెంలోని రక్షిత మంచినీటి పథకం నిరుపయోగంగా ఉంది. వాస్తవానికి నీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని తోలాల్సి ఉన్నా కాంట్రాక్టరు సక్రమంగా సరఫరా చేయడం లేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.

ఒక్క ఇంటి పట్టా అయినా ఇచ్చారా..?
మత్స్యకారపాలెంలో ఒక్కో ఇంటిలో నాలుగైదు కుటుంబాలు నివాసం ఉంటున్నారు. దీంతో మాకు ఇంటి పట్టా ఇచ్చి పక్కా గృహం కట్టించి ఇవ్వాలని ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా ప్రయోజనం లేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు..

అరకొరగా వేట నిషేధ భత్యం..
వేట నిషేధ భత్యం ఇవ్వడంలోనూ అన్యాయం జరుగుతోందని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. మండలంలో సుమారు 1,200 మందికి మాత్రమే వేట నిషేధ భత్యం లభిస్తోంది. వాస్తవానికి చేపల వేటలో ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గానీ సుమారు 5 వేల మంది వరకు ఆధారపడి ఉన్నారు. కానీ వీరెవరికి వేటనిషేధ భత్యం లభించడం లేదు.  చేపల వేటపై ఆధారపడే ప్రతి ఒక్కరికీ వేటనిషేధ భత్యం ఇవ్వాలని మత్స్యకారులు కోరుతున్నారు. మత్స్యకారుల కోసం చేపల మార్కెట్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు అవి నిర్మాణ దశలో ఉన్నాయే తప్ప ప్రారంభానికి నోచుకోలేదు. పాకల బీచ్‌లో చేపల కేంద్రం నిర్మించినా అది కూడా ప్రారంభానికి నోచుకోలేదు. అంతేకాక బీచ్‌లో మాత్రం సుమారు రూ.4 కోట్ల రూపాయల అంచనావ్యయంతో రెస్టారెంటు మాత్రం నిర్మిస్తున్నారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. 

శిథిలావస్థలో తుఫాన్‌ షెల్టర్లు
 ప్రకృతి వైపరీత్యాల సమయంలో మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రభుత్వం తుఫాన్‌షెల్టర్లను ఏర్పాటు చేసింది. అయితే పాకల పల్లెపాలెం, ఊళ్లపాలెం దేవలం పల్లెపాలెం తుఫానుషెల్టర్లు శిథిలావస్థకు చేరుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. వీటి నిర్మాణంపై ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. అదే విధంగా 10 ఏళ్ల క్రితం మత్స్యకారపాలెంలో ఏర్పాటు చేసిన తుఫాన్‌ హెచ్చరికల కేంద్రం నిరుపయోగంగా మారింది. దాని గురించి పట్టించుకునే వారే కరువయ్యారు.

అద్దె భవనంలోనే రెసిడెన్షియల్‌ స్కూలు..
మత్స్యకారుల పిల్లల కోసం సుమారు రూ.25 కోట్ల అంచనా వ్యయంతో గురుకుల పాఠశాలల తరహాలో వసతి గృహాన్ని నిర్మిస్తామని సుమారు మూడేళ్ల క్రితం ఎమ్మెల్యే స్వామి వాగ్దానం చేశారు. ఈ వసతి గృహం కోసం అప్పటి తహశీల్దార్‌ షేక్‌ దావూద్‌హుస్సేన్‌ ఉళ్లపాలెం పంచాయతీ పరిధిలోని వడ్డెరకాలనీ పక్కన ఉన్న 9 ఎకరాల స్థలాన్ని పరిశీలించి ఎంపిక చేశారు. ఈ స్థలాన్ని అప్పటి కందుకూరు ఆర్‌డీఓ మల్లికార్జునరావు కూడా పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. వాస్తవానికి గతంలో ఈ స్థలాన్ని ఊళ్లపాలెం గ్రామస్తులకు ప్రభుత్వం పట్టాలు కూడా ఇచ్చింది. అయితే వీరికి మరోచోట స్థలం ఇస్తామని చెప్పటంతో పట్టాదారులు అంగీకారం తెలిపారు.

అయితే ఈ స్థలంలో నేటికి వసతి గృహం నిర్మాణానికి శంకుస్థాపన చేయలేదు. అయితే ఈ వసతి గృహాన్ని టంగుటూరులో అద్దె భవనంలో ఏర్పాటు చేశానని. త్వరలో శంకుస్థాపన చేస్తానని ఎమ్మెల్యే చెబుతున్నారని మత్స్యకారులు తెలియజేస్తున్నారు. వాస్తవానికి మండలంలో ఏర్పాటు చేయకుండా టంగుటూరులో ఏర్పాటు చేయడమేంటని మత్స్యకారులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాక టంగుటూరులో ఏర్పాటు చేయడంతో మత్స్యకారుల పిల్లలు 80 శాతం ఉండాల్సి ఉండగా కేవలం 30 శాతం మాత్రమే ఉన్నారని పేర్కొంటున్నారు. దీనికి తోడు ఈ భవనంలో వసతులు కూడా సక్రమంగా లేవని, అది కూడా కేవలం బాలికలకు మాత్రమే ఏర్పాటు చేశారంటున్నారు.

ఒక్క హామీ అమలు చేయలేదు
టీడీపీ ప్రభుత్వం మత్స్యకారుల కోసం ఎటువంటి పథకాలు సక్రమంగా అమలు చేయలేదు. చివరికి మా పిల్లల కోసం శాశ్వత వసతిగృహæం ఏర్పాటు చేస్తామని చెప్పి టంగుటూరులో అద్దె భవనంలో ఏర్పాటు చేశారు. అక్కడ విద్యార్థినులకు పూర్తిస్థాయిలో వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. 
- ప్రళయకావేరి రోశయ్య, పాకల

పట్టించుకున్న వారు లేరు
మా పాలెంలో చేపల హేచరీ ఏర్పాటు చేయాలని కోరాం. ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాం. కానీ విజ్ఞప్తి పట్టించుకున్న నాథుడు లేడు. చివరికి బాపట్ల ప్రాంతానికి ఈ హేచరీ వెళ్లిపోయిందని అధికారులు తెలిపారు.
-  వాయిల రమేష్, పోతయ్యగారి పట్టపుపాలెం

మత్స్యకారులకు తీవ్ర అన్యాయం
టీడీపీ ప్రభుత్వంలో సాంప్రదాయ మత్స్యకారులకు తీవ్ర అన్యాయం జరిగింది. చేపలు అమ్ముకోవటానికి ఎటువంటి వాహనాలు ఇవ్వలేదు. మాకన్నా ఇతర కులాల వారికి అధిక సంఖ్యలో ఇచ్చారు. ప్రస్తుతం మాకు మోపెడ్లు మంజూరైనా ఎన్నికల కోడ్‌ అని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు. వీటిని ఎప్పుడు పంపిణీ చేస్తారో అర్థం కావడం లేదు.
- రాసాని కృపారావు, పాకల

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top