కత్తి మహేష్‌పై వేటు తగదు | Sakshi
Sakshi News home page

కత్తి మహేష్‌పై వేటు తగదు

Published Wed, Jul 11 2018 1:10 PM

Kathi Mahesh City Expulsion Is Not Correct - Sakshi

శ్రీకాకుళం(పీఎన్‌కాలనీ) : రాముడు, రామాయణం గురించి కత్తి మహేష్‌ విమర్శించాడని, ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడని పేర్కొంటూ తెలం గాణ ప్రభుత్వం, డీజీపీ అతనిని హైదరాబాద్‌ నుంచి బహిష్కరించడం తగదని దళిత ఆదివాసీ సంఘాల జేఏసీ నాయకులు మండిపడ్డారు. శ్రీకాకుళం నగరంలో అంబేడ్కర్‌ విజ్ఞాన మందిర్‌లో మంగళవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కత్తి మహేష్‌ దళిత కులానికి చెందినవాడని బహిష్కరించారని, అగ్రకులస్తుడైతే అంత ధైర్యం చేయరన్నారు. తక్షణమే నగర బహిష్కరణ ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు.

గతంలో రాముడుమీద, రామాయణం మీద అనేక విమర్శలు చేసిన, రాసిన ప్రముఖ రచయిత్రి ముప్పాళ్ళ రంగనాయకమ్మ మీద గాని, రచయిత ఆరుద్రపైన, చలం, ప్రముఖ న్యాయవాది రామ్‌జఠ్మాలానీపై ఎటువంటి శిక్షలు వేయకుండా దళితుడిపై ఇటువంటి చర్యలు తీసుకోవడం హేయమైన చర్య అని అన్నారు.

ఈ సమావేశంలో దళిత ఆదివాసీ జేఏసీ నాయకులు కలివరపు సింహాచలం, కల్లేపల్లి రామ్‌గోపాల్, పోతల దుర్గారావు, డి.గణేష్, కంఠ వేణు, అంపోలు ప్రతాప్, మిస్క కృష్ణయ్య, బోసు మన్మథరావు, ఎస్‌.ఎబేరు పాల్గొన్నారు.

Advertisement
Advertisement