సమాంతర కాలువకు ‘సుదర్శన ’ చక్రం అడ్డు! | Karnataka, Andhrapradesh representives meeting on HLC | Sakshi
Sakshi News home page

సమాంతర కాలువకు ‘సుదర్శన ’ చక్రం అడ్డు!

Oct 24 2013 3:03 AM | Updated on Sep 1 2017 11:54 PM

సమాంతర కాలువకు ‘సుదర్శన ’ చక్రం అడ్డు!

సమాంతర కాలువకు ‘సుదర్శన ’ చక్రం అడ్డు!

ఎన్నో అవాంతరాల తర్వాత తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ(హెచ్చెల్సీ)కు సమాంతర కాలువ ప్రతిపాదనపై కర్ణాటక సర్కారు సానుకూలంగా స్పందిస్తుంటే..

 సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఎన్నో అవాంతరాల తర్వాత తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ(హెచ్చెల్సీ)కు సమాంతర కాలువ ప్రతిపాదనపై కర్ణాటక సర్కారు సానుకూలంగా స్పందిస్తుంటే.. మన రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి పి.సుదర్శనరెడ్డి మాత్రం మోకాలడ్డే యత్నం చేస్తున్నారు. సమావేశానికి మంత్రి గైర్హాజరు కావాలని నిర్ణయించిన నేపథ్యంలో బెంగళూరులో శుక్రవారం నిర్వహించనున్న సమావేశ లక్ష్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి.
 
 తుంగభద్ర నదిపై కర్ణాటక-ఆంధప్రదేశ్ రాష్ట్రాలు సంయుక్తంగా హొస్పేట వద్ద 133 టీఎంసీల సామర్థ్యంతో తుంగభద్ర డ్యామ్‌ను నిర్మించారు. దీని నుంచి వృథాగా పోతున్న నీటిని సద్వినియోగం చేసుకోవాలంటే.. హెచ్చెల్సీకి సమాంతర కాలువ తవ్వి, టీబీ డ్యామ్‌కు వరద వచ్చే సమయంలో వైఎస్సార్ జిల్లాలోని పీఏబీఆర్, ఎంపీఆర్, సీబీఆర్, మైలవరం రిజర్వాయర్లను నింపుకుని, ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని అందించవచ్చునని నీటి పారుదల రంగ నిపుణులు దశాబ్దాలుగా చెబుతూ వస్తున్నారు. కానీ ఈ ప్రతిపాదనను కర్ణాటక, ప్రధానంగా బళ్లారి జిల్లా రైతులు ససేమిరా అంటూ వచ్చారు. కానీ.. ఇటీవల బళ్లారి రైతుల్లో మార్పు వచ్చింది. సమాంతర కాలువ వల్ల తమకు కూడా ప్రయోజనం ఉంటుందని గుర్తించారు. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే సమాంతర కాలువపై పలుమార్లు కర్ణాటకు విజ్ఞప్తి చేశారు. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.. సర్వే చేయించి సమాంతర కాలువ వల్ల ఇరు ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుతుందని తేల్చారు.
 
 ఈ క్రమంలోనే రెండు రాష్ట్రాల ప్రతినిధి బృందంతో శుక్రవారం(తొలుత గురువారం అనుకుని.. వాయిదా వేశారు) బెంగళూరులో సంయుక్త సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి ప్రతినిధి బృందాన్ని పంపాలని కర్ణాటక సర్కారు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. తెలంగాణకు నీటిని తెచ్చే ఆర్డీఎస్‌కు అన్యాయం జరుగుతుందనే సాకు చూపి బెంగళూరు సమావేశంలో పాల్గొనడానికి తెలంగాణ ప్రాంతానికి చెందిన భారీ నీటి పారుదల శాఖ మంత్రి పి.సుదర్శనరెడ్డి ఆసక్తి చూపడం లేదని తెలిసింది. దీంతో రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి, కలెక్టర్ లోకేష్‌కుమార్ తదితరులు సమావేశానికి హాజరుకానున్నారు. అయితే.. సమాంతర కాలువ తవ్వకం వల్ల ఆర్డీఎస్‌కు ఎలాంటి అన్యాయం జరగదని నీటి పారుదలరంగ నిపుణులు స్పష్టం చేస్త్తున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement