
మా సూచనను పట్టించుకోలేదు
గత సంప్రదాయాలను కొనసాగించేలా బడ్జెట్ సమావేశాల్ని కనీసం 40 రోజులపాటు నిర్వహించాలని ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి చేసిన ప్రతిపాదనల్ని శాసనసభా వ్యవహారాల సలహా సంఘం(బీఏసీ)లో అసలు పట్టించుకోలేదని వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్: గత సంప్రదాయాలను కొనసాగించేలా బడ్జెట్ సమావేశాల్ని కనీసం 40 రోజులపాటు నిర్వహించాలని ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి చేసిన ప్రతిపాదనల్ని శాసనసభా వ్యవహారాల సలహా సంఘం(బీఏసీ)లో అసలు పట్టించుకోలేదని వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు అటు ప్రభుత్వం ఇటు సభాపతి నిర్ద్వంద్వంగా తోసిపుచ్చి ప్రజాసమస్యలపై బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని ఆయన దుయ్యబట్టారు. చిన్న రాష్ట్రంలో చాలా చిన్న సమస్యలే ఉంటాయని బీఏసీలోనూ బుల్డోజ్ చేసే ధోరణితో అధికారపక్షం వ్యవహరించిందన్నారు. ఇది దానినైజాన్ని తెలియజేస్తుందన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో వైఎస్సార్సీపీ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు అంజాద్ బాషా, కిడారి సర్వేశ్వరరావు, ముత్యాలనాయుడు, జయరామయ్యలతో కలసి జ్యోతుల విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్రంలో ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై తాము 16 అంశాలతో స్పీకర్కు నోట్ ఇచ్చామని, టీడీపీ కూడా 13 అనుకూల అంశాలతో నోట్ ఇచ్చిందని, అయితే ఒకే అంశాన్ని(రేషన్ కార్డుల పంపిణీ) రెండుసార్లు రాసి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిందన్నారు. గత సమావేశాల్లోనూ తనకు జవాబు చెప్పే అవకాశం లేకుండా చేశారని, అప్పుడు మీడియా ద్వారా చెప్పాల్సివచ్చిందనే విషయాన్ని ప్రతిపక్ష నేత జగన్ బీఏసీలో ప్రస్తావించారని, ఈసారైనా గత పోకడల్ని అనుసరించవద్దని కోరారని, అయితే అధికార పక్షం నిర్లక్ష్యంగా వ్యవహరించి మందబలాన్ని ప్రదర్శించడం దారుణమని ఆయన మండిపడ్డారు. బిల్లుల్ని పాస్ చేయించుకోవడానికి మధ్యాహ్నమూ సభను నడుపుతామని చెప్పారేకానీ, ప్రజాసమస్యలపై చర్చిద్దామనే విషయానికి మాత్రం కేటాయించిన సమయానికే లోబడి ఉంటుందని బీఏసీలో చెప్పారన్నారు. విభజన చట్టంలో హామీలు, రైతు ఆత్మహత్యలు, కరువు ప్రాంతాల్లో సహాయచర్యలు, తాగునీటి సమస్య, పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్, పోలవరం ప్రాజెక్టు పూర్తి, తదితరాలపై చర్చించేం దుకు గడువు పెంచాలని కోరితే ఏకపక్షంగా సభను నడుపుతామనే సంకేతాలిచ్చేలా ప్రవర్తించారని జ్యోతుల ధ్వజమెత్తారు.
టీడీపీ కరపత్రం చదివినట్లుంది: గడికోట
గవర్నర్ ప్రసంగంలో ప్రజలకు ఏవిధంగా భరోసా కల్పిస్తామనే విషయాలను పక్కనపెట్టి ఆయనతో టీడీపీ కరపత్రం చదివించినట్లుందని వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్(కడప) జిల్లాలో 48 మండలాలు తీవ్ర కరువుతో అల్లాడుతున్నాయని ఆ జిల్లా ప్రజలపై కక్షపూరితంగా వ్యవహరించొద్దని కోరారు. అంజాద్ బాషా మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగంలో మైనార్టీల ఊసే లేదని, సినిమా స్క్రిప్ట్ మాదిరిగా ఉందని విమర్శించారు.