అర్చకులకు రిటైర్మెంట్ మంచిది పద్ధతి కాదు : ఐవైఆర్
సాక్షి, చిత్తూరు : టీటీడీ అర్చకులకు రిటైర్మెంట్ అనేది మంచిది పద్ధతి కాదని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. ఆదివారం జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో అభివృద్ధి వికేంద్రీకరణ, సామాజిక న్యాయంపై చర్చించారు. ఈ సదస్సుకు జస్టిస్ ఈశ్వరయ్య, మాజీ స్పీకర్ అగరాల ఈశ్వర్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావులు పాల్గొన్నారు. సదస్సులో ఐవైఆర్ కృష్ణారావు రచించిన ‘అమరావతి ఎవరి రాజధాని’ పుస్తకాన్నా ఈశ్వర్రెడ్డి ఆవిష్కరించారు.
అనంతరం ఐవైఆర్ మాట్లాడుతూ.. టీటీడీ మ్యానిఫెస్టోలో అర్చకుల పదవీ విరమణ అన్నది ఉండదని ఉందని తెలిపారు. కానీ ఇప్పుడు పదవీ విరమణ ప్రకటన ఎందుకు చేయాల్సి వచ్చిందని అధికారులను ప్రశ్నించారు. అర్చకుల పదవీ విరమణ అనేది మంచి పద్ధతి కాదని వ్యాఖ్యానించారు. తిరుమలలో పూజా కైంకార్యాలు సరిగా జరగడం లేదని రమణ దీక్షితుల భావన అని, ఇందుకు పరిపాల విభాగమే కారణమని ఆయన పేర్కొన్నారని ఐవైఆర్ గుర్తుచేశారు. ఆరోపణలపై విచారణ చేస్తే వాస్తవాలు బయటకొస్తాయన్నారు.
నేను ఈవోగా ఉన్నపుడు గొల్ల మండపం పగలగొట్టాలని కొందరు సలహా ఇచ్చారు.. కానీ నేను అందుకు అభ్యంతరం వ్యక్తం చేశానని ఐవైఆర్ గుర్తుచేశారు. శేఖర్రెడ్డి టీటీడీ సభ్యుడుగా ఉంటూ కోట్ల రుపాయలతో పట్టుబడటంతో అన్యమతస్తురాలైన అనితను బోర్డు సభ్యురాలిగా నియమించిపుడు టీటీడీ ప్రతిష్ట దెబ్బతినలేదా.? అని ప్రశ్నించారు. కానీ ఇప్పుడు రమణ దీక్షితులు కొన్ని అంశాలను ప్రస్తావిస్తే.. టీటీడీ ప్రతిష్ట దెబ్బతింటుదని చెప్పడం ఎంతవరకు సమంజసం అని ఐవైఆర్ మండిపడ్డారు.