అంతర్‌ జిల్లా బైకుల దొంగ అరెస్టు | Internal district biker thief arrested | Sakshi
Sakshi News home page

అంతర్‌ జిల్లా బైకుల దొంగ అరెస్టు

Jun 4 2017 1:55 AM | Updated on May 25 2018 5:49 PM

గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో బైకు దొంగతనాలు, గృహాల్లో దోపిడీలకు పాల్పడుతున్న అంతర్‌ జిల్లా దొంగను మార్కాపురం శివారు ఎస్టేట్‌ వద్ద వై.జంక్షన్‌

మార్కాపురం : గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో బైకు దొంగతనాలు, గృహాల్లో దోపిడీలకు పాల్పడుతున్న అంతర్‌ జిల్లా దొంగను మార్కాపురం శివారు ఎస్టేట్‌ వద్ద వై.జంక్షన్‌ సమీపంలో పట్టణ పోలీసులు శనివారం ఉదయం అరెస్టు చేసినట్లు డీఎస్పీ మాసుంబాషా తెలిపారు. పట్టణ పోలీసుస్టేషన్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను ఆయన వెల్లడించారు.

డీఎస్పీ కథనం ప్రకారం.. కనిగిరి మండలం చింతలపాలేనికి చెందిన చింతల సిసింద్రీ అలియాస్‌ సూర్య శనివారం స్థానిక వై.జంక్షన్‌ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. సిసింద్రీ నెల్లూరు జిల్లా ముంజమూరులో మోటార్‌ సైకిల్‌ను, కావలి టూటౌన్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో అపాచీ మోటార్‌ సైకిల్‌ను, గుంటూరు పట్టాభిపురం పోలీసుస్టేషన్‌ పరిధిలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ను దొంగతనం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

ముంజమూరులో పట్టపగలు ఇంట్లోకి ప్రవేశించి 20 తులాల విలువ చేసే వెండి వస్తువులను దొంగిలించినట్లు తేలింది. ఇటీవల మార్కాపురం పట్టణ పోలీసుస్టేషన్‌ పరిధి భగత్‌సింగ్‌ కాలనీలో దొంగతనం చేసి రెండు వెండి గిన్నెలు దొంగిలించాడు. వెండి ఆభరణాలు, మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. సైడ్‌ లాక్‌ లేని వాహనాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని సిసింద్రీ దొంగతనాలు చేస్తాడని చెప్పారు. నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తున్నట్లు వివరించారు. కేసులో ప్రతిభ కనబరిచిన సీఐ బత్తుల శ్రీనివాస్, ఎస్‌ఐ బూదాల శ్రీకాంత్, ఏఎస్‌ఐ అల్లూరిరెడ్డి, రైటర్‌ మాల్యాద్రిరెడ్డి, కానిస్టేబుల్‌ వెంకట్, హోంగార్డు రమణలను డీఎస్పీ అభినందించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement