ఆసక్తిగా తాండూరు సమరం | interesting in tandur municipality elections | Sakshi
Sakshi News home page

ఆసక్తిగా తాండూరు సమరం

Mar 4 2014 11:36 PM | Updated on Mar 28 2018 10:59 AM

తాండూరులో రోజురోజుకూ మున్సిపోల్స్ ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన రెండు రోజుల్లోనే రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.

 తాండూరు, న్యూస్‌లైన్:  తాండూరులో రోజురోజుకూ మున్సిపోల్స్ ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన రెండు రోజుల్లోనే రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. చైర్మన్‌గిరి కోసం ఆయా పార్టీల నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీలో ఈ పరిస్థితి అధికంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి నలుగురు నేతల సతీమణుల పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఇద్దరు మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. స్థానిక వైద్యుడు సంపత్‌కుమార్ సతీమణి సునీత, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అనురాధా చైర్మన్ పదవికి పోటీ పడుతున్నారు. ఇద్దరిలో ఎవరికి అవకాశం ఇవ్వాలనేది పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి రమేష్‌కు సంకటంగా మారింది.

ఈ విషయంలో ఆయన ఆచితూచి ముందుకు సాగుతున్నారు. వివిధ వర్గాలు, పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయం మేరకు అభ్యర్థిని ఖరారు చేయాలని యోచిస్తున్నారు. చైర్మన్ అభ్యర్థి ఎంపికలో మాజీ ఎమ్మెల్యే నారాయణరావు కీలక పాత్ర పోషించనున్నారు. ఆయన మద్దతు ఉన్న వారికే ఖరారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక టీఆర్‌ఎస్ నుంచి ఇప్పటి వరకు వ్యాపారవేత్త, ఆర్యవైశ్య సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు కోట్రిక వెంకటయ్య సతీమణి విజయలక్ష్మి చైర్మన్ రేసులో ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఈ విషయంలో ఆమె సుముఖంగా లేనట్లు సమాచారం. దీంతో జేఏసీ సలహాదారుడు, విద్యావేత్త రంగారావు సతీమణి రిటైర్డ్ లెక్చరర్ విజయాదేవి పేరు తెరపైకి వచ్చింది. రెండు రోజుల్లో ఈ విషయంలో జేఏసీ నేతలు సమావేశమై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

స్థానిక ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడంతో టీడీపీలో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల బాధ్యతలు ఎవరు స్వీకరిస్తారనేది అంతుచిక్కకుండా ఉంది. మరోవైపు ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా పాగా వేయాలని కమలనాథులు పట్టుమీదున్నారు. ఇద్దరు సీనియర్ నేతల సతీమణులు చైర్మన్ రేసులో ఉన్నప్పటికీ అంతర్గత చర్చలతో ఒకరు పోటీలో ఉండే అవకాశం ఉంది. ఇక వార్డుల వారీగా బలమైన అభ్యర్థుల ఎంపికలో కూడా కమలనాథులు జోరుగా సమాలోచనలు చేస్తున్నారు. ప్రధాన పార్టీల నుంచి మాజీ కౌన్సిలర్లు సైతం రిజర్వేషన్ల వారీగా ఆయా వార్డులను తమకు కేటాయించాలని జోరుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు.

మరోసారి అవకాశం కల్పించాలని ఆయా పార్టీల ముఖ్యనేతలకు విన్నవిస్తున్నారు. దీంతో ఆయా వార్డుల నుంచి కొత్తగా టిక్కెట్ ఆశిస్తున్న యువ నాయకులు అయోమయంలో పడ్డారు. తమకు అవకాశం కల్పించాలని దీటుగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. మొత్తంగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీలు వివిధ కోణాల్లో సేకరించిన సర్వే వివరాల ఆధారంగా చైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థులను ఖరారు చేయాలని యోచిస్తున్నాయి. రెండు రోజుల్లో ప్రధాన పార్టీల చైర్మన్ అభ్యర్థులు ఖరారు అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎవరికీ పోటీ చేసే అవకాశం దక్కుతుందనేది ఆసక్తిగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement