వ్యవసాయం ఏదీ? | injusties happen to agriculture in budget | Sakshi
Sakshi News home page

వ్యవసాయం ఏదీ?

Aug 23 2014 2:33 AM | Updated on Jun 4 2019 5:04 PM

నవ్యాంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను శుక్రవారం అసెంబ్లీలో మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రవేశపెట్టారు.

 కనీసం భరోసా కూడా కల్పించలేకపోయారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను శుక్రవారం అసెంబ్లీలో మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రవేశపెట్టారు. ఇందులో కర్నూలు జిల్లాకు ప్రత్యేక నిధులేవీ కేటాయించలేదు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దిన వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా రైతులకు బోలెడన్ని హామీలు ఇచ్చారు. రాయలసీమలో అత్యంత వెనుకబడిన జిల్లా కర్నూలేనని పదేపదే ప్రస్తావించారు. అటువంటి కరువు జిల్లాపై చంద్రబాబు ప్రభుత్వం కరుణించలేదు. నంద్యాలలో విత్తనోత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసి వ్యవసాయ విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.

అదే విధంగా బనవాసిని గొర్రెలు, మేకలు, ఒంగోలు గిత్తల పరిశోధనా కేంద్రంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆదోని, ఆలూరు, నందికొట్కూరు పరిధిలో సాగవుతున్న పంటలను జింకలు నాశనం చేస్తున్నాయని.. ఆలూరు ప్రాంతంలో జింకల పార్కును ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించేందుకు సోలార్, విండ్ ఎనర్జీ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. వీటిలో ఏ ఒక్క దానికి బడ్జెట్‌లో ఒక్క రూపాయి కేటాయించలేదు.

Advertisement
 
Advertisement
Advertisement