అదే దూకుడు

India A team win by 64 runs on Zealand A team

భారత్‌ ఏ జట్టుదే సిరీస్‌  న్యూజిలాండ్‌ ఏ పై 64 పరుగులతో విజయం

విశాఖ స్పోర్ట్స్‌ : నాలుగో వన్డేలో న్యూజిలాండ్‌ఏ పై భారత్‌ ఏ జట్టు 64 పరుగుల తేడాతో విజయం సాధించింది.  ఐదు వన్డేల సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. టాస్‌గెలిచిన భారత్‌ ఏ ఆరువికెట్లు కోల్పోయి 289 పరుగులు చేసింది. న్యూజిలాండ్‌ ఏ 225 పరుగులకే చేతులెత్తెసింది. మిడిలార్డర్‌లో కొంత ప్రతిఘటించినా ఫలితం లేకపోయింది. నదీమ్‌ నలుగుర్ని పెవిలియన్‌కు పంపగా సిద్దార్థ్‌ మూడు, శార్దుల్‌ రెండు వికెట్లు తీసి జట్టుకు విజయాన్నందించారు. వొర్కెర్‌ సెంచరీ వృథా కాగా భారత్‌ ఏ తరఫున ఓపెనర్‌ అభిమన్యు 83 పరుగులు చేసి అనూహ్యంగా రనౌటై వెనుతిరిగాడు. శార్దుల్‌ హాట్రిక్‌ను మిస్‌ అయ్యాడు.

సిరీస్‌ చిక్కింది
భారత్‌ ఏ మరో మ్యాచ్‌ మిగిలివుండగానే న్యూజీలాండ్‌ ఏపై అనధికార వన్డే సిరీస్‌ను చేజిక్కించుకుంది. వర్షం కారణంగా తొలి వన్డే రద్దుకాగా రెండో వన్డే టైగా ముగిసింది. ఇక మూడు,నాలుగు వన్డేలను భారత్‌ ఏ జట్టే గెలవడంతో 2–0తోనే సిరీస్‌ చేజిక్కింది.  ఆదివారం జరిగే చివరి వన్డే నామమాత్రమే కానుంది. గడిచిన రెండు మ్యాచ్‌లు డేనైట్‌గా సాగగా నాలుగో వన్డే మాత్రం షెడ్యూలు ప్రకారం ఉదయం తొమ్మిదిగంటలకే ప్రారంభం అయింది.

కెప్టెన్‌ మారాడు...
రెండు, మూడు వన్డేల్లో కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడిన భారత్‌ ఏ జట్టు కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ ఈసారి విశ్రాంతి తీసుకున్నాడు. జరిగిన రెండు వన్డేల్లో టాస్‌ ఓడిన కెప్టెన్‌ శ్రేయాస్‌ స్థానంలో వచ్చిన రిషబ్‌ పంత్‌ టాస్‌ గెలిచాడు. ఈసిరీస్‌ తొలిసారి ఛేజింగ్‌ కంటే లక్ష్యాన్ని నిర్ధేశించడానికే మొగ్గు చూపాడు. అయితే కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ను రిషబ్‌ ఆడలేకపోయాడు.  ఏడు బంతులాడినా కేవలం రెండే పరుగులు చేసిన ఈ వికెట్‌కీపర్‌ న్యూజిలాండ్‌ ఏ వికెట్‌కీపర్‌ బ్లండెల్‌కే కాచ్‌ ఇచ్చి వెనుతిరిగాడు. 

వొర్కెర్‌ సెంచరీ వృథా : న్యూజిలాండ్‌ ఏ 50 పరుగులకే కీలక ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ను కోల్పోయింది. అయినా వొర్కెర్‌ మాత్రం నిలకడగానే ఆడుతూ పదకొండు బంతుల్ని బౌండరీకి తరలించాడు.  మరో రెండు సిక్సర్లుగా మలిచాడు. 108 పరుగులు చేసిన వొర్కెర్‌ చివరికి నదీమ్‌కు లెగ్‌బిఫోర్‌గా దొరికిపోయాడు.

అంతా క్యాచ్‌లే..
భారత్‌ ఏ జట్టు ఆరువికెట్లు కోల్పోయింది. ఓపెనర్‌ అభిమన్యు అనూహ్యంగా రనౌట్‌ కాగా మిగిలిన వారంతా క్యాచ్‌ల ద్వారానే వెనక్కి మళ్లారు. 

జట్టే మారింది...
నాలుగో వన్డేలో న్యూజిలాండ్‌ ఏతో పాటు భారత్‌ ఏ జట్టు రిజర్వ్‌ బెంచ్‌కు అవకాశం ఇచ్చింది. న్యూజిలాండ్‌ఏ జట్టులో ఇప్పటికే నలుగురు ఆటగాళ్లు న్యూజిలాండ్‌ ప్రధానజట్టుకు అర్హత సాధించారు.  

ఇదిలా వుండగా భారత్‌ ఏ శిబిరంలోని 12వ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్‌ ఈ సారి ఏకంగా ఓపెనర్‌గానే వచ్చి మెరుపులు మెరిపించాడు. సెంచరీ చేజార్చుకున్నా ఏడు బంతుల్ని బౌండరీకి తరలించాడు. ఇక రిజర్వ్‌ బెంచ్‌ ఆటగాడు ప్రశాంత్‌ చొప్రా సయితం భారత్‌ ఏ జట్టుకు ఓపెనర్‌గానే వచ్చాడు.  వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్‌ ఈసారి ఏకంగా కెప్టెన్‌గానే మారిపోయాడు. 

హాట్రిక్‌ చేజారింది...
మరో ఆరు ఓవర్లు మిగిలివున్నాయి. శార్దుల్‌ ఠాకుర్‌ బౌలింగ్‌కు వచ్చాడు. తొలి రెండు బంతులు విసిరిన అనంతరం అప్పటికే క్రీజ్‌లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న ఆస్టే›న్‌లను వెనక్కిపంపాడు.  తర్వాతి బంతికే  వికెట్‌ను తీయడంతో భారత్‌ శిబిరంలో ఒక్కటే ఉత్కంఠ.  హాట్రిక్‌ చేసేందుకు సిద్ధమైన శార్దుల్‌ ఠాకుర్‌ ప్రయత్నం ఫలించలేదు.  అయితే తర్వాత ఓవర్‌లో నదీమ్‌ వేసిన తొలిబంతికే వికెట్‌ తీయడంతో న్యూజిలాండ్‌ ఏ జట్టు పరాజయం పాలైంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top