కేసీ కెనాల్ పరిధిలోని రైతులు వివిధ రకాల పంటలు సాగు చేసుకునేందుకు వీలుగా వచ్చే మార్చి వరకు సాగు నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని అఖిలపక్ష సమావేశంలో నేతలు డిమాండ్ చేశారు.
మైదుకూరు(చాపాడు), న్యూస్లైన్: కేసీ కెనాల్ పరిధిలోని రైతులు వివిధ రకాల పంటలు సాగు చేసుకునేందుకు వీలుగా వచ్చే మార్చి వరకు సాగు నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని అఖిలపక్ష సమావేశంలో నేతలు డిమాండ్ చేశారు.
లేకపోతే ఆందోళనకు దిగుతామని ముక్తకంఠంతో హెచ్చరించారు. మైదుకూరు సమీపంలోని కేసీ కె నాల్ కార్యాలయం వద్ద బుధవారం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో పలువురు నేతలు మాట్లాడారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవడంతో శ్రీశైలం జలాశయంలో నీటిమట్టడం 881 అడుగులకు చేరిందన్నారు. దీంతో రబీకీ కేసీ కెనాల్ పరిధిలోని రైతులకు సాగు నీరందించవచ్చన్నారు. ఖరీఫ్లో వరి సాగు అనంతరం ఇప్పటికే చాలా చోట్ల రెండో కారు కోసం తక్కువ వ్యవధి గల వరిసాగు కోసం రైతులు నారుమళ్లను సిద్ధం చేసుకున్నారని తెలిపారు. రబీలో ఆరుతడి పంటలను సాగు చేశారని, అయితే కేసీ నీరు విడుదలపై ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన చేయలేదన్నారు. కేసీ కెనాల్ అధికారులు మాత్రం ఈ నెల 25 తరువాత ఎప్పుడైనా కేసీ కెనాల్లో సాగు నీరు ఆగిపోవచ్చని అంటున్నారని పేర్కొన్నారు. అదే నిజమైతే రైతుల తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.
కనీసం మార్చి నెలాఖరు వరకైనా నీరిస్తే రైతులు బాగుపడతారని పేర్కొన్నారు. ఈ విషయంపై జనవరి 5లోగా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకపోతే అదే నెల 6 నుంచి ఆందోళనలు, బంద్లు నిర్వహిస్తామని హెచ్చరించారు. తమ సమస్యలపై కలెక్టరు సహా ఎమ్మెల్యేలకూ వినతి పత్రాలు అందజేస్తామన్నారు. అఖిలపక్ష నాయకులు పోలు కొండారెడ్డి, ఏవీ రమణ, బీపీ ప్రతాప్రెడ్డి, రాజమోహన్రెడ్డి, మల్లారెడ్డి, సుబ్బారెడ్డి, బద్వేలు సుబ్బన్న, ములపాకు ప్రతాపరెడ్డి, గుండంరాజు సుబ్బయ్య, ఎస్.బాలసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.