మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బృందం పరిశీలన | hospital observation of the Medical Council of India | Sakshi
Sakshi News home page

మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బృందం పరిశీలన

Mar 1 2014 2:55 AM | Updated on Oct 9 2018 7:52 PM

ఇద్దరు సభ్యులు గల మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) బృందం శుక్రవారం జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాలను పరిశీలించింది

 నిజామాబాద్‌అర్బన్, న్యూస్‌లైన్ : ఇద్దరు సభ్యులు గల మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) బృందం శుక్రవారం జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాలను పరిశీలించింది. అహ్మదాబాద్ మెడికల్ కళాశాలకు చెందిన ప్రొఫెసర్ భరత్‌షా, మహారాష్ట్రకు చెందిన ప్రొఫెసర్ సూర్యప్రకాశ్‌రావులు ఉదయం ఆరు గంటలకే కళాశాలకు చేరుకున్నారు.  భరత్‌షా  కళాశాలకు అనుబంధమైన ఆస్పత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించారు. రోగులకు సేవలు ఎలా అందిస్తున్నారు.

 వివిధ విభాగాల ఏర్పాటు, వైద్యులు ఎంత మంది ఉన్నారు. వైద్యపరీక్షలు, ఆపరేషన్ థియేటర్లు, వైద్య పరికరాల ఏర్పాటుకు సంబంధించి విడివిడిగా పరిశీలన చేశారు. నూతన భవనంలో విభాగాల  ఏర్పాటు సంతృప్తి కరంగా ఉందంటూ తెలియజేశారు.అయితే రోగులకు వైద్యసేవలు అందించడంలో వైద్యుల ఏర్పాటుపై ప్రశ్నించినట్లు తెలిసింది.

 మెడికల్ కళాశాలలో డాక్టర్ సూర్యప్రకాశ్‌రావు లెక్చరర్ గ్యాలరీ, తరగతి గదులు, ఆడిటోరియం, శవపరీక్ష గదులు, ల్యాబ్స్, గ్రంథాలయం తదితర విభాగాలను పరిశీలించారు. ప్రొఫెసర్ల నియామకంపై  మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొదటి సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య, వారికి ఇప్పటి వరకు బోధించిన విద్యావిధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఈ పరిశీలన జరిగింది.అనంతరం రాత్రి ఏడు గంటల నుంచి 10.30 గంటల వరకు నివేదికల పరిశీలించారు.

  శనివారం కూడా ఎంసీఐ బృంద సభ్యులు పరిశీలనలు చేస్తారు. అనంతరం నివేదికలను మెడికల్ కౌన్సిల్ ఆఫ్  ఇండియాకు (ఎంసీఐ) సమర్పిస్తారు. రెండవ సంవత్సరం ఎంబీబీఎస్ తరగతుల అనుమతి కోసం ఈ పరిశీలన సాగింది.

Advertisement
 
Advertisement
Advertisement