గన్నవరం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

High Tension At Gannavaram MRO Office - Sakshi

సాక్షి, కృష్ణా : గన్నవరం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వినతి పత్రం ఇవ్వటానికి వెళ్లిన గన్నవరం ఎయిర్‌ పోర్ట్‌ నిర్వాసితులకు తహశీల్దార్‌ నుంచి నిర్లక్ష్య సమాధానం ఎదురవ్వటంతో తహశీల్దార్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. మూడేళ్లు గడుస్తున్నా ప్రత్యామ్నాయం చూపటం లేదంటూ ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. గన్నవరం విమానాశ్రయం నిర్వాసితులు శనివారం వినతి పత్రం అందచేయటానికి తహశీల్దార్‌ కార్యాలయం వద్దకు వెళ్లారు. తహశీల్దార్‌కు వినతి పత్రం ఇవ్వగా.. ‘ఎన్నికల డ్యూటీపై వచ్చా నాకు ఏం తెలియదు’ అంటూ తహశీల్దార్  మధుసూదనరావు నిర్లక్ష్య సమాధానం ఇచ్చారు.

దీంతో తహశీల్దార్‌ తీరుపై నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నూజివీడు సబ్ కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పే వరకు తమ నిరసన విరమించేది లేదంటూ కార్యాలయం లోపల వారు భైఠాయించారు. నిర్వాసితులు ఆందోళన చేస్తున్నా పట్టించుకోకుండా సమావేశం ఉందంటూ తహశీల్దార్ అక్కడి నుంచి వెళ్లిపోవటం గమనార్హం.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top