
‘అకాల’ నష్టం
మండలంలోని కుణుతూరు గ్రామంలో శనివారం రాత్రి పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గాలులు వీయడంతో గ్రామస్తులు భయంతో భీతిల్లారు.
గాలి, వడగళ్ల వాన
నేలకూలిన విద్యుత్ టాన్స్ఫార్మర్, స్తంభాలు
అంధకారంలో గ్రామాలు
పత్తి, టమోట, మిరప పంటలకు నష్టం
బాధితులను పరామర్శిన మంత్రి పల్లె రఘునాథరెడ్డి
ధర్మవరం రూరల్/సోమందేపల్లి/ముదిగుబ్బ : మండలంలోని కుణుతూరు గ్రామంలో శనివారం రాత్రి పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గాలులు వీయడంతో గ్రామస్తులు భయంతో భీతిల్లారు. గాలులకు ఏళ్లనాటి వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ టవర్లు విరిగిపడ్డాయి. గ్రామంలో పూరిగుడిసెలు, రేకుల షెడ్లు ఎగిరిపడ్డాయి. ద్రాక్ష తోటలు నేలమట్టమయ్యాయి. శ్రీనివాసరెడ్డి అనే రైతుకు చెందిన క్యాప్సికమ్ కోసం ఏర్పాటు చేసిన గ్రీన్ టెంట్ పూర్తిగా ధ్వంసమైంది.
దీంతో సుమారు రూ.25 లక్షలు నష్టం వాటిల్లిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. గాలులకు విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో గ్రామంలో అంధకారం నెలకొంది. రాత్రంతాగ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. జరిగిన నష్టంపై రెవెన్యూ, ఉద్యానశాఖ అధికారులు అంచనాలు తయారు చేస్తున్నారు. గ్రామంలో టీడీపీకి చెందిన వారి పేర్లు మా త్రమే పరిహార జాబితాలో నమోదు చేసుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పార్టీలకతీతంగా నష్టపోయిన వారందరికీ న్యాయం చే యాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నా రు.
గ్రామాన్ని సందర్శించిన మంత్రి పల్లె : ఐటి శాఖా మంత్రి పల్లె రఘనాథరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ తదితరులు గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని అంచనా వేశారు. బాధితులను ఆదుకుంటామ ని హామీ ఇచ్చారు. విద్యుత్ స్తంభాలను సరిచేసి వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సమగ్రంగా విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు.
కుణుతూరు గ్రామాన్ని సందర్శించిన కేతిరెడ్డి
కుణుతూరు గ్రామాన్ని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆదివారం సందర్శించారు. నష్టపోయిన రైతు శ్రీనివాసరెడ్డి తోటను పరిశీలించి జరిగిన నష్టాన్ని రైతుతో అడిగి తెలుసుకున్నారు. నష్టం విలువ దాదాపు రూ. 25 లక్షల దాకా ఉంటుందన్నారు. కేతిరెడ్డి వెంట రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట చౌదరి, జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాసరెడ్డి, చిన్న క్రిష్ణారెడ్డి, గంగిరెడ్డి, తదితరులు ఉన్నారు.
వడగళ్ల వానతో అతలాకుతలం - నేలకూలిన 12 విద్యుత్ స్తంభాలు
పందిపర్తి (సోమందేపల్లి): మండల పరిధిలోని పందిపర్తిలో శనివారం సాయంత్రం కురిసిన వడగళ్లవానకు పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో పాటు, పలు ఎకరాల్లో పత్తి, టమోట, మిరప పంట నష్టం జరిగింది. శనివారం సాయంత్రం అరగంట సేపు వడగళ్ల వాన కురియడంతో గ్రామస్తులు, పోలాల వద్ద ఉన్న రైతులు ఆందోళన చెందారు. వానకు తోడుగా పెద్ద ఎత్తున గాలి తోడవ్వడంతో 63 కేవీ ట్రాన్స్ఫార్మర్ నేలకొరిగింది.
11 కేవి లైను, ఎల్టీ లైనుపై పడడంతో విద్యుత్ వైర్లు తెగి కిందకు పడ్డాయి. వ్యవసాయ బోర్లకు ఏర్పాటు చేసిన 13 విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. 11 కేవి లైను ఎల్టీ లైన్పై పడడంతో ఎన్ని మోటార్లు కాలిపోయి ఉంటాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆస్తి నష్టం విలువ రూ. 40 వేలు ఉంటుందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. నాగభూషణ్రెడ్డి తనకున్న రెండు ఎకరాలలో వేసిన మిరప పంటకూడా పూర్తిగా నాశనమైంది.
ఆస్తి నష్టం విలువ రూ.20 వేలు ఉంటుందని వాపోయాడు. మంచేపల్లికి చెందిన రైతు కిష్టప్ప కూడా తనకున్న రెండు ఎక రాలలో టమోటా పంట సాగు చేశాడు. గాలి, వానకు మొత్తం పంట నాశనం అయింది. దాదాపుగా రూ లక్ష నష్ట జరిగిందని రైతు ఆవేదన చెందుతున్నాడు. అదే విధంగా వేప, నేరేడు చెట్లు కూడా నేలకొరిగాయి. ప్రస్తుతం ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసేవరకు గ్రామానికి నీటి సౌకర్యం కూడా లేదని గ్రామస్తులు తెలిపారు. వెంటనే విద్యుత్ లైన్ను పునరుద్ధరించాలని రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని బా దిత రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ధ్వంసమైన మునగ చెట్లు
ముదిగుబ్బ : ఎన్ఎస్వి కొట్టాల గ్రా మంలో శనివారం రాత్రి అకాల వర్షం, గాలులకు ము నగ పంట ధ్వంసమైంది. రైతు ఇందుకూరు ఆదినారాయణ నాలుగున్నర ఎకరాల్లో వర్షం దాటికి రెండు ఎ కరాల్లోని మునగ చెట్లు ధ్వంసమయ్యాయి. వీఆర్వో నారాయణస్వామి ఆదివారం పొలాన్ని పరిశీలించి పం టనష్టాన్ని అంచనా వేశారు.