
విభజన హామీలు అమలు చేస్తాం
సాక్షి, న్యూఢిల్లీ : విభజిత ఆంధ్రప్రదేశ్కు చట్టంలో పేర్కొన్న విభజన హామీల అమలుకు కట్టుబడి ఉన్నామని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. పది జాతీయ సంస్థలను విభజిత ఏపీలో నిర్మించాలని చట్టంలో పేర్కొన్నారని, పది ఏళ్లలో వీటిని నిర్మించాలని చట్టంలో పొందుపరిచారని చెప్పారు. వీటన్నింటికీ కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. మంగళవారం రాజ్యసభలో జీవీఎల్ మాట్లాడుతూ 2015-16లోనే ఏపీలో జాతీయ విద్యాసంస్ధలను ఏర్పాటు చేశామని, అదే ఏడాది ఐఐటీ తరగతులను ప్రారంభించామని చెప్పుకొచ్చారు.
ఉమ్మడి ఏపీలో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగలేదని, ఒక ప్రాంతానికే అభివృద్ధి పరిమితమైందని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కలే జాతీయ సంస్ధలు ఏర్పాటయ్యాయని అన్నారు. విభజన తర్వాత ఏపీకి అన్యాయం జరిగిందనే భావన అక్కడి ప్రజల్లో నెలకొందని చెప్పారు.