కూలీ డబ్బుల కోసం ఆశపడి చిత్తూరు, కడప జిల్లా సరిహద్దులోని శేషాచలం అటవీ ప్రాంతానికి తమిళనాడు కూలీలు వస్తున్నారు.
రాజంపేట, న్యూస్లైన్: కూలీ డబ్బుల కోసం ఆశపడి చిత్తూరు, కడప జిల్లా సరిహద్దులోని శేషాచలం అటవీ ప్రాంతానికి తమిళనాడు కూలీలు వస్తున్నారు. రెండురోజులుగా వందకుపైగా తమిళతంబీలు అటవీ అధికారులకు పట్టుబడ్డారు. మేస్త్రీ పంపిస్తే వచ్చాం.. చెట్లు నరికేందుకు రోజుకు రూ. 300 నుంచి రూ 500 ఇస్తారని చెబుతున్నారు. తమ వెంటనే పదునైన గొడ్డళ్లను తెచ్చుకుంటారు. వీరికి అడవిలో ఒకరోజుకు సరిపడే అన్నం సరఫరా చేస్తారు.. అదే అన్నంను మరుసటి రోజు నీళ్లు కలుపుకుని తాగుతారు.
కొట్టిన ఎర్రచందనం దుంగలను డ్రస్సింగ్ చేసి 30 నుంచి 40 కిలోమీటర్ల మోసుకుని రోడ్డు మార్గానికి చేరవేస్తారు. ఈ విధంగా ఎర్రచందనం అక్రమరవాణాకు కూలీలను స్మగ్లర్లు వినియోగించుకుంటున్నారు. ప్రధానంగా తమిళనాడులోని వేలూరు, సేలం, తిరవళ్లూరు, చిత్తూరు జిల్లా సరిహద్దులోని కొన్ని తమిళ ప్రాంతాలకు చెందిన కూలీలను మాట్లాడుకుని శేషాచలం తరలిస్తున్నారు. ఇద్దరు అటవీ అధికారుల హత్య నేపథ్యంలో శేషాచలం అడవుల్లో కూంబింగ్ ముమ్మరం చేశారు. అటవీ, పోలీసుశాఖలు మూకుమ్మడిగా రెండురోజులుగా 119 మంది కూలీలను అరెస్ట్ చేశారు.