దిగుబడి, మార్కెటింగ్‌పై దృష్టి | Focus on Yield and Marketing | Sakshi
Sakshi News home page

దిగుబడి, మార్కెటింగ్‌పై దృష్టి

Aug 18 2013 5:16 AM | Updated on Sep 1 2017 9:53 PM

వ్యవసాయ పరిశోధనస్థానాల్లో పంటల సాగుతోపాటు మార్కెటింగ్‌పై దృష్టి పెట్టినట్లు ఆచార్య ఎన్జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్ ఆఫ్ ఎక్స్‌టెన్షన్ రమేశ్‌కుమార్‌రెడ్డి చెప్పారు.

జగిత్యాల జోన్, న్యూస్‌లైన్ :వ్యవసాయ పరిశోధనస్థానాల్లో పంటల సాగుతోపాటు మార్కెటింగ్‌పై దృష్టి పెట్టినట్లు ఆచార్య ఎన్జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్ ఆఫ్ ఎక్స్‌టెన్షన్ రమేశ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. జగిత్యాల మండలం పొలాస వ్యవసాయ పరిశోధనస్థానాన్ని ఆయన  శనివారం సందర్శించారు. పరిశోధనస్థానంలో సాగుచేసిన వరి, పసుపు, చెరుకు, సోయాబీన్ తదితర పంటలు పరిశీలించారు. వరి పంటను వివిధ పద్ధతుల ద్వారా సాగు చేసే విధానాలు, లాభనష్టాలపై పరిశోధనస్థానం డెరైక్టర్ కిషన్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. రైతులకు లాభదాయకంగా ఉండే పంటలపై ప్రత్యేక పరిశోధనలు చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలను కోరారు.
 
 రైతులు పంట పండిస్తున్నారుగానీ సరైన లాభాలను మాత్రం అర్జించడం లేదని, వారికి మార్కెటింగ్ నైపుణ్యాలను తెలియజేయాల్సిన బాధ్యత శాస్త్రవేత్తలపై ఉందని చెప్పారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు చేసే ప్రతి ప్రయోగం రైతులను దృష్టిలో ఉంచుకుని చేయాలని సూచించారు. ప్రతీ పంటలో ఉపయోగించే ఆధునిక యంత్రాలను రైతుల చెంతకు చేరుస్తున్నామని వివరించారు. యువ శాస్త్రవేత్తలు పరిశోధన వ్యాసాలు రాసేందుకు ముందుకు రావాలని కోరారు. పరిశోధనస్థానంలో శాస్త్రవేత్తల కొరత ఉందని, వెంటనే తీర్చాలని కోరగా.. సానుకూలంగా స్పందించారు.  ఆయన వెంట అసిస్టెంట్ డీన్ ఆప్ ఎక్స్‌టెన్షన్ విజయాభినందన్‌రావు, సీనియర్ శాస్త్రవేత్త వెంకటయ్య, శాస్త్రవేత్తలు చంద్రమోహన్, తిరుమల్‌రావు, సుధారాణి, శ్రీలత, తిప్పె స్వామి, శోభారాణి పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement