సంధి ముగిసె.. ఇక వేటకు వెడలవలె!  

Fishermen Waiting Ap Govt Help - Sakshi

సాక్షి, ఒంగోలు : గంగమ్మ తల్లిని నమ్ముకున్న గంగపుత్రుల పరిస్థితి ముందు వేట.. వెనుక అప్పులు అన్నచందంగా మారింది. మరో 24 గంటల్లో మత్స్యకారులు వేటకు బయలుదేరే సమయం ఆసన్నమైంది. వేట నిషేధ సంధికాలం ముగియనుండటంతో మత్స్యకారులు వేటకు కావాల్సిన వలలు, పడవలను సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. 60 రోజుల పాటు సముద్రంలో వేట లేక పూట గడవక నానా తంటాలు పడిన మత్స్యకారులు తిరిగి వేటకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా సంధికాలం ఇచ్చే సాయాన్ని ప్రభుత్వం త్వరగా అందించాలని మత్స్యకారులు వేడుకుంటున్నారు.

సముద్రంలో వేటనిషేధ సమయంలో ప్రభుత్వం అందించే కరువుభత్యం సాయం గత టీడీపీ ప్రభుత్వం సరిగా అందించకపోవడంతో జాలర్లు నానా కష్టాలు పడ్డారు. అయితే గతనెల 30న ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి తమకు అండగా నిలుస్తాడని మత్స్యకారులు గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. 

బాబు హయాంలో అరకొరగా సాయం..
సముద్రంలో మత్స్య సంపంద పునరుత్పత్తి సమయమైన ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు 60 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం సముద్రంలో చేపల వేట నిషేధాన్ని విధించింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రతి ఏటా వేట నిషేధ సమయంలో ఒక్కో మత్స్యకార కుటుంబానికి జీవనభృతి కింద 31 కేజీల బియ్యాన్ని అందించేందుకు చట్టాన్ని రూపొందించింది. అయితే 2014లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన ప్రస్తుత మాజీ సీఎం చంద్రబాబు జీవన భృతి కింద ఒక్కో మత్స్యకారుడికి రూ.4వేలు అందిస్తానని హామీ ఇచ్చారు. 

సంధికాలం సాయం అరకొరగా అందించి చేతులు దులుపుకున్నారు. వేట నిషేధ కాలం శుక్రవారంతో పూర్తవుతున్నప్పటికి ధా సమయంలో అందించాల్సిన ప్రభుత్వ సాయం (జీవన భృతి) నేటికి ఒక్కరికి కూడా మత్య్సకారులకు అందలేదు. అయితే ఇటీవల సీఎంగా బాధ్యతలు చేపట్టిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మత్య్సకారులకు జీవనభృతి కింద ఒకొక్కరికి రూ.10 వేలు సాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది. దీంతో గంగపుత్రులు గండెడాశతో ఎదురు చూస్తున్నారు. ప

జిల్లాలో 102 కిలో మీటర్ల మేర తీరం ఉండగా 74 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. 80వేలకు పైగా మత్స్యకారులు ఉన్నారు. చీరాల నియోజకవర్గంలోని వాడరేవు, విజయలక్ష్మీపురం, పొట్టిసుబ్బయ్యపాలెం, రామాపురం, కఠారివారిపాలెం గ్రామాల్లో మత్య్సకారులే అధికం. వీరందరికి సముద్రంలో వేటే జీవన ఆధారం. ఈ గ్రామాల్లోని ప్రజలందరు ప్రత్యక్షంగా, పరోక్షంగా చేపల వేట, మత్య్స సంపద అమ్మకాలపైనే ఆదారపడి జీవిస్తున్నారు. గతేడాది నిషేధ సాయానికి మెలికలు పెట్టి కొందరికే తూతూ మంత్రంగా చంద్రబాబు సాయం అందించారని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ ఏడాది నుంచి ఆ ఇబ్బందులు ఉండవని వేట నిషేధ సమయంలో ప్రభుత్వ అందించే సాయం సరైన సమయంలో వైఎస్‌ జగన్‌ అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top