తండ్రి ఆశయం నెరవేర్చిన తనయుడు | Father, son ambition fulfilled | Sakshi
Sakshi News home page

తండ్రి ఆశయం నెరవేర్చిన తనయుడు

May 16 2014 2:09 AM | Updated on Sep 2 2017 7:23 AM

తండ్రి ఆశయం నెరవేర్చిన తనయుడు

తండ్రి ఆశయం నెరవేర్చిన తనయుడు

తల్లి, తండ్రి పనిచేస్తే పూట గడస్తుంది.. లేదంటే పస్తులే.. అలాంటి పేద కుటుంబలో పుట్టిన ఓ విద్యార్థి కష్టాలను అధిగమించాడు.

డోన్ రూరల్, న్యూస్‌లైన్: తల్లి, తండ్రి పనిచేస్తే పూట గడస్తుంది.. లేదంటే పస్తులే.. అలాంటి పేద కుటుంబలో పుట్టిన ఓ విద్యార్థి కష్టాలను అధిగమించాడు. తండ్రిని కోల్పోయిన బాధలోనూ పదో తరగతి పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాడు. గురువారం వెలువడిన ఫలితాల్లో ఆ విద్యార్థికి 9.3 పాయింట్లు వచ్చాయి. డోన్ పట్టణానికి చెందిన మధుసూదన్ నాయుడి విషాదంతో కూడిన విజయగాథ ఇది.
 
పట్టణంలోని తారకరామనగర్‌కు చెందిన శ్రీనివాసులు నాయుడు రైసు మిల్లులో పని చేసేవాడు. ఇతనికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కుటుంబ పోషణ కోసం భార్య మల్లేశ్వరితోపాటు కుమారులు గోపి, శివ కూలీ పనికి వెళ్లేవారు. పెద్ద కుమార్తె వరలక్ష్మికి పెళ్లి కాగా, రెండో కుమార్తె శిరీష ఆరో తరగతి చదువుతోంది. ఇంకో కుమారుడు మధుసూదన్ స్థానిక పాఠశాలలో పదో తరగతి చదివాడు. బాగా చదువుకోవాలని.. మంచి మార్కులు తెచ్చుకోవాలని తండ్రి చెప్పేవాడు. ఆ మేరకు చదువులో ఆ విద్యార్థి చురుగ్గా ఉండేవాడు.
 
అయితే మార్చి నెలలో పదో తరగతి గణితం పరీక్ష రోజున అనారోగ్యంతో శ్రీనివాసులు నాయుడు చనిపోయాడు. తండ్రి ఆశయం నెరవేర్చేందుకు పుట్టెడు దుఃఖంలోనూ బాధను దిగమింగుకొని ఆ విద్యార్థి పరీక్షలకు హాజరయ్యాడు.

గురువారం వెలువడిన ఫలితాల్లో అత్యధిక పాయింట్లతో పాఠశాలలోనే ప్రథమ స్థాయిలో నిలిచాడు. తన కుమారుడిని ఉన్నత చదువులు చదివించాలనుకున్న తండ్రి కలలు నిజం చేస్తూ మంచి ఫలితం సాధించడంతో కుటుంబ సభ్యులు, పాఠశాల యాజమాన్యం ఆ విద్యార్థిని అభినందించారు. కష్టపడి చదివి ఇంజినీర్ కావాలన్నదే తన లక్ష్యమని మధుసూదన్ నాయుడు తెలిపాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement