బొబ్బిలిలో నకిలీ నోట్ల చెలామణి..

fake currency in vizianagaram district - Sakshi

పోలీసుల అదుపులో ముఠా..?

మద్యం షాపు యజమానులే పట్టించారా..

బొబ్బిలి: బొబ్బిలిలో ఒక్కసారిగా నకిలీనోట్ల  కలకలం రేగింది. ప్రశాంతంగా ఉండే పట్టణంలో నకిలీనోట్ల చలామణి జరుగుతున్నట్లుగా పోలీసులకు ఫిర్యాదు అందినట్లు సమాచారం. కొన్ని రోజులుగా ఈ రకం నోట్ల చలామణిపై అపోహలున్నా పోలీసులకు ఫిర్యాదు చేసేంత వరకూ వెళ్లలేదు. ఇటీవల కాలంలో మద్యం షాపులకు వరుసగా ఈ దొంగనోట్లు రావడంతో వారు ఆందోళన చెందారు. హడావిడిగా జరిగే వ్యాపార కార్యకలాపాల్లో కొంతమంది నకిలీ నోట్లు ఇస్తూ మోసానికి పాల్పడుతున్నట్లు సమాచారం. రామాటాకీస్‌ సెంటర్‌లో ఉన్న మద్యం దుకాణానికి ఇలానే దొంగనోట్లు వస్తున్నా వ్యాపారులు గుర్తించలేకపోయారు. అయితే ఈ వ్యవహారం సోమవారం బయట పడింది. 

మద్యం దుకాణాన్ని తెరవగానే ఓ నిందితుడు నకిలీ నోటుతో మద్యం కొనుగోలు చేయడానికి ప్రయత్నించగా సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది. అయితే గొల్లపల్లికి చెందిన ఓ వ్యక్తితో పాటు మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.  నకిలీనోట్లను చలామణీ చేస్తున్నదెవరు..?. ఈ క్రమంలో వారి వెనుక బలమయిన శక్తులున్నాయా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. పోలీసులు నిందితుల వద్ద నుంచి భారీగానే నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారన్న  వార్త పట్టణంలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ తతంగంపై పోలీసులు పెదవి విప్పితేనే అసలు విషయం బయటకు వస్తుంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top