విరమిస్తామన్నారు.. పితాని; విరమించేది లేదు: విద్యుత్ ఉద్యోగులు | Electricity employees clarify their stand on strike | Sakshi
Sakshi News home page

విరమిస్తామన్నారు.. పితాని; విరమించేది లేదు: విద్యుత్ ఉద్యోగులు

Oct 8 2013 10:40 PM | Updated on Sep 27 2018 5:59 PM

సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు సమ్మెను విరమిస్తామని హామీ ఇచ్చారని రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ చెప్పారు. కానీ అలా జరగలేదు.

సమైక్య రాష్ట్రం కోసం నిరవధిక సమ్మె చేస్తున్న సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకులు సమ్మె విరమిస్తున్నారని, అత్యవసర సేవలను పునరుద్ధరించేందుకు రేపు సాయంత్రంలోగా మిగిలిన సంఘాలతో ను, జిల్లా జేఏసీల నాయకులతోను చర్చించి సమ్మెను విరమిస్తామని హామీ ఇచ్చారని రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ చెప్పారు. అయితే, నాయకులు బయటకు వచ్చిన తర్వాత మాత్రం వారు చెప్పిన విషయం వేరేలా ఉంది.

ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మె విరమించేది లేదని, రాష్ట్రం సమైక్యంగా ఉండటమే తమ ఏకైక లక్ష్యమని నాయకులు అన్నారు. 30 వేల మంది పర్మినెంట్ ఉద్యోగులు, 20 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మె కొనసాగిస్తారని స్పష్టం చేశారు. లోపల ముఖ్యమంత్రితో చర్చలు కూడా వాడివేడిగా సాగినట్లు సమాచారం. సమ్మె కొనసాగిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సీఎం హెచ్చరించారు. అయినా, ప్రజలు తమతో ఉన్నందున ఎవరూ ఏమీ చేయలేరని విద్యుత్ ఉద్యోగులు ఆయనతో స్పష్టం చేశారు. విభజన ముందుకు సాగదని అప్పట్లో చెప్పారు.. కానీ కేబినెట్ నోట్ కూడా వచ్చేసింది, దానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విభజనను అడ్డుకునేందుకు మీవద్ద ఉన్న కార్యాచరణ ఏంటని వారు నిలదీయగా, దానికి ముఖ్యమంత్రి సమాధానం ఏమీ ఇవ్వలేకపోయారని తెలిసింది. మిమ్మల్ని నమ్ముకుని గతంలో నిరవధిక సమ్మెను ఆపామని, ఇప్పుడు మాత్రం అలా చేసేది లేదని ఉద్యోగులు స్పష్టం చేసినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement