ఎన్నికల టీం రెడీ | Election team ready | Sakshi
Sakshi News home page

ఎన్నికల టీం రెడీ

Feb 22 2014 2:21 AM | Updated on Oct 3 2018 6:55 PM

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగవంతం అవుతోంది. లోక్, రాజ్యసభలు తెలంగాణ బిల్లుకు ఆమోద ముద్ర వేశాయి.

కలెక్టరేట్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగవంతం అవుతోంది. లోక్, రాజ్యసభలు తెలంగాణ బిల్లుకు ఆమోద ముద్ర వేశాయి. ఇక రాష్ట్రపతి ఆమోద ముద్ర, గెజిట్ ప్రకటనే తరువాయి. అనంతరం ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో రాజకీయ నాయకులు బేరీజు వేసుకుంటున్నారు. ఇక ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వెలువడినా సమర్థవంతంగా నిర్వహించడానికి ఎన్నికల టీం రెడీ అవుతోంది. ఓటర్ల జాబితా ప్రకటించడమే కాకుండా ఎన్నికల నిర్వహణకు అవసరమయ్యే వాటిపై కసరత్తు చేస్తోంది.

ఈసీ ఆదేశాలకు  మేరకు ఇప్పటికే జిల్లాలో బదిలీలు జరిగాయి. జిల్లాకు బదిలీపై వచ్చిన కొత్త తహశీల్దార్లు కొందరు ఇప్పటికే విధుల్లో చేరారు. జిల్లాస్థాయి అధికారులు, కొత్తగా వచ్చిన 47 మంది తహశీల్దార్లతో ఇప్పటికే కలెక్టర్ అహ్మద్‌బాబు సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని సూచనలు చేశారు.

 పర్యవేక్షణ బాధ్యతలు
 ఈ నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని కలెక్టరేట్ అధికారులకు సమాచారం అందింది. ఇందులో భాగంగా జాయిం ట్ కలెక్టర్, ఐటీడీఏ పీవోలతోపాటు జిల్లా స్థాయి అధికారులను నోడల్ అధికారులుగా నియమించారు. జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతంకు ఎస్‌వీఈఈపీ, హెల్ప్‌లైన్, ఫిర్యాదుల పరిష్కారాల బాధ్యతలు అప్పగించారు. ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్‌కు కంప్యూటరైజేషన్, ఎన్నికల వ్యయం, ఎస్‌ఎంఎస్ మానిటరింగ్, కమ్యూనికేషన్ ప్లాన్ బాధ్యతలు నిర్వర్తిస్తారు.

 డీఆర్వో రాజుకు జిల్లా పరిశీలన ప్రణాళిక, శాంతి భద్రతలు.. సీపీవో షేక్‌మీరాకు బ్యాలెట్ పత్రాలు, డమ్మీ బ్యాలెట్ పత్రాల ముద్రణ.. డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డికి సిబ్బంది శిక్షణ.. డీఈవో రామరావుకు మ్యాన్ పవర్ మేనేజ్‌మెంట్.. ఆర్వీఎం పీవో శ్రీనివాస్‌రెడ్డికి ఈవీఎం పర్యవేక్షణ.. ఉప రవాణా శాఖ కమిషనర్ ప్రవీణ్‌రావుకు రవాణా పర్యవేక్షణ.. పరిశ్రమల జీఎం రవీందర్‌కు మెటీరియల్ మేనేజ్‌మెంట్.. కార్మిక శాఖ ఉప కమిషనర్ దండపాణికి ఇంప్లిమెంటింగ్ ఎంసీసీ.. వికలాంగుల శాఖ ఏడీ నారాయణరావుకు అబ్జర్వర్.. డీపీఆర్వో రవికుమార్‌కు మీడియా కమ్యూనికేషన్ విభాగాల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.

 రిటర్నింగ్ అధికారులు
 జిల్లాలోని పది నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులను నియమించనున్నారు. అధికారికంగా ఆదేశాలు రావాల్సి ఉంది. రిటర్నింగ్ అధికారులు నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలలో ఉన్న అధికారులు.. సిర్పూర్ నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారిగా గిరిజన సంక్షేమ శాఖ ఇన్‌చార్జి ఎస్డీసీ, ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, ఆసిఫాబాద్‌కు సబ్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్, ఖానాపూర్‌కు ఉట్నూర్ ఆర్డీవో రామచంద్రారావు, ఆదిలాబాద్‌కు ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, బోథ్‌కు డ్వామా పీడీ వినయ్‌కృష్ణారెడ్డి, నిర్మల్‌కు ఆర్డీవో అరుణశ్రీ, ముథోల్‌కు ఏజేసీ రాజు, చెన్నూర్, బెల్లంపల్లికి ఇన్‌చార్జి ఎస్డీసీ తిరుపతిరెడ్డి, మంచిర్యాలకు ఆర్డీవో చక్రధర్‌రావును నియమించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement