అరచేతిలో ఎన్నికల యాప్స్‌

Election Commission Campaign For Vote Awareness - Sakshi

ఇంట్లోంచే ఓటరు అన్నీ తెలుసుకోవచ్చు

పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల ప్రకటన నేపథ్యంలో ఓటుపై మరింత పరిజ్ఞానం అవసరం

సాక్షి, విశాఖపట్నం :ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వజ్రాయుధం వంటిది. ఎన్నికల ప్రక్రియలో ఎదురవుతున్న అవరోధాలను తొలగించడానికి ఎన్నికల సంఘం(ఈసీ) సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించు కొంటోంది. ఈ నేపథ్యంలోనే యాప్‌లు, సాఫ్ట్‌వేర్‌ వినియోగం అందుబాటులోకి తీసుకొచ్చింది. నా ఓటు, సమాధాన్‌ , మ్యాట్‌ డాటా, సీ విజిల్,సుగం, మాట్‌దాన్‌ , సువిధ యాప్‌లతో ఎన్నికల్లోలోటుపాట్లపై ఇంటర్‌నెట్‌ ద్వారా ఫిర్యాదుచేయొచ్చు. త్వరలో పార్లమెంట్‌ ఎన్నికల ప్రకటనవెలువడిన క్రమంలో ఆయా యాప్‌లపై ఓటర్లు పరిజ్ఞానాన్ని పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో వాటి గురించి ‘సాక్షి’ ప్రత్యేక కథనం. 

నా ఓటు యాప్‌
ఓటర్‌ సెర్చ్‌ ఆప్షన్‌ లో డిటెయిల్‌ఎంటర్‌ చేస్తే తొలుత మనకుసంబంధించిన ఓటర్‌ ఐడీ వస్తుంది.నియోజకవర్గం, పేరు, పోలింగ్‌స్టేషన్‌  వివరాలు వస్తాయి. ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ ఎప్పుడు వస్తుంది. వలంటీర్ల వివరాలు, పోలింగ్‌స్టేషన్‌కు ఎలా వెళ్లాలి తదితర వివరాలు వస్తాయి. సెర్చ్‌లోకి వెళ్లి ఎపిక్‌నంబర్‌ కొడితే దారి చూపుతుంది.వికలాంగులకు వాహనాలు రావాలన్నా కోరవచ్చు.

ఓటరు వెరిఫైబుల్‌ ఆడిట్‌ ట్రయల్‌..
ఎన్నికల్లో పారదర్శకత కోసం అందుబాటులోకి తీసుకొచ్చిందే ఓటరు వెరిఫైబుల్‌ ఆడిట్‌ ట్రయల్‌. దీన్నే వీవీ ప్యాట్‌ అంటారు. ఈ సాఫ్ట్‌వేర్‌ ఉన్న యంత్రం ఒకటి ఈవీఎంతో పాటు పక్కన ఉంటుంది. ఓటు వేశాక వీవీ ప్యాట్‌ తెరపై మనం ఏ గుర్తుకు ఎంపిక చేసుకున్నామో కనిపిస్తుంది. ఇది కేవలం 7 సెకన్లు అందుబాటులో ఉంటుంది.ఇది ట్యాంపరింగ్‌ జరగలేదని ఓటరు నిర్ధరణ చేసుకోవచ్చు.

సుగం యాప్‌
ఎన్నికల సమయంలో అభ్యర్థుల ప్రచార నిర్వహణకు వినియోగించే వాహనాలను నియంత్రించడానికి రూపొందించిందే సుగం యాప్‌. ప్రచారం కోసం అభ్యర్థులు, పార్టీలు పోలింగ్‌ సందర్భంగా అధికా రులు వినియోగించే వాహనాల రాకపోకల వివరాలన్నీ యాప్‌లో నమోదవుతాయి. వినియోగించే వాహనాలు, వాటి యజమానులు, డ్రైవర్ల వివరాలు ఉంటాయి. ఓటర్ల జాబితాను చూసుకొనే యాప్‌లు కూడా ఉన్నాయి.

డబుల్‌ ఓటుంటే అంతే..
ఏదైన ఒక ప్రాంతంలో ఓటు హక్కు కల్పించాలనే ఉద్దేశంతో ఈఆర్వో నెట్‌.20 వర్షన్‌ సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టింది ఎన్నికల సంఘం. అధికారులు ముందుగా ఈ సాఫ్ట్‌వేర్‌ను వివిధ ప్రాంతాల్లో ఓటరు జాబితాలో ఉపయోస్తారు. ఆ తర్వాత నగరంలోని ఓటరు జాబితాలో ఉపయోగించి ఒకే వ్యక్తి పేరిట రెండుఓట్లు ఉంటే సంబంధిత ఓటరుకు కౌన్సెలింగ్‌ ఇచ్చి ఒక ఓటును తొలగిస్తారు.

సీ విజిల్‌ ..
ఓటర్లను ప్రలోభానికి గురిచేసే చర్యలు, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయాలంటే అధికారులను నేరుగా కలవాల్సిందే. విచారణ జరిపినా ఆధారాలు లభించకపోవచ్చు. ఇప్పుడు ఉల్లంఘన జరిగిన చోటు నుంచి విజిల్‌ ఊదే సదుపాయం ఎన్నికల సంఘం ఈ యాప్‌ ద్వారా అందించింది.సీ విజిల్‌ యాప్‌లో ఉల్లంఘనులకు సంబంధించిన చిత్రాలనుతీసి పంపవచ్చు. నిమిషాల వ్యవధిలోనే సంబంధిత అధికారులు చర్యలకు ఉపక్రమించాలి. లేదంటే వారే బాధ్యులవుతారు.

సమాధాన్‌ ...
ఎన్నికల సమయంలో ఓటర్ల సందేహాల నివృత్తికి అధికారులు ఆర్డీవో, కలెక్టర్ల కార్యాలయాల్లో టోల్‌ఫ్రీ నంబర్‌ 1950, ఈ మెయిల్, ఫ్యాక్స్,ఎస్‌ఎంఎస్, తపాలా ద్వారా ఫిర్యాదు చేసే మార్గాలున్నాయి. ఈక్రమంలో ఇప్పటి నుంచి స్మార్ట్‌ ఫోన్‌ ల ద్వారానే సందేహాలను నివృత్తిచేసుకోవచ్చు. స్మార్ట్‌ ఫోన్‌ లో సమాధాన్‌  యాప్‌ను దిగుమతి చేసుకుని ఆ యాప్‌ ద్వారా సందేహాల్ని నివృత్తి చేసుకోవచ్చు. ఫిర్యాదులకు ఎన్నికల సంఘం స్పందించి సమాధానమిస్తుంది.

ఓటరు సర్వీసు పోర్టల్‌
ఓటు నమోదు కోసం నేషనల్‌ ఓటరు సర్వీసు పోర్టల్‌ యాప్‌అందుబాటులోకి తెచ్చింది. మన ఇంట్లోనే ఉండి ఓటునునమోదు చేసుకోవచ్చు. ఈ సర్వీసు పోర్టల్, యాప్‌లో మన ఓటుఏ స్థితిలో ఉందో తెలుసుకోవచ్చు. అధికారులు ధ్రువీకరించినతర్వాత గుర్తింపు కార్డుని సర్వీసు పోర్టల్‌ నుంచి పొందే వెసులుబాటు ఉంది. దీని ద్వారా ఓటు నమోదు చేసుకోవడానికి కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలు తప్పుతాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top