ఓటర్ల నమోదుపై అధికారుల గంభీర ప్రకటనలు. కొత్తవారు పేర్లను నమోదు చేయించుకొని జాతీయ ప్రక్రియకు సహకరించాలని విజ్ఞప్తులు. వాస్తవం అందుకు భిన్నం. ప్రతీ మారు దరఖాస్తులు ప్రయాసలకోర్చి ఇస్తున్నా.
ఓటర్ల నమోదుపై అధికారుల గంభీర ప్రకటనలు. కొత్తవారు పేర్లను నమోదు చేయించుకొని జాతీయ ప్రక్రియకు సహకరించాలని విజ్ఞప్తులు. వాస్తవం అందుకు భిన్నం. ప్రతీ మారు దరఖాస్తులు ప్రయాసలకోర్చి ఇస్తున్నా..ఓటర్ల కార్డు దశకు వచ్చేవి ఎన్నో తెలీని పరిస్థితి. గతానుభవాల దృష్ట్యా ఇదీ ఓటర్లకు దరఖాస్తు చేసుకున్నవారి సందేహం. ఈ సారైనా తమకు కార్డు వస్తుందా అనేది వారు వేస్తున్న వేయిడాలర్ల ప్రశ్న. అధికారుల పటిష్ట చర్యలే ఇందుకు సమాధానం చెప్పాలని వారి ఆశ.
కలెక్టరేట్, న్యూస్లైన్: జిల్లాలో కొత్త ఓటర్లను జాబితాలో చేర్చే విషయమై అయోమయం నెలకొంది. ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతిసారీ అధికారులు వివిధ కారణాలు చూపి రద్దుచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ సారైనా ఓటరు జాబితాలో చోటిస్తారా.. లేక మళ్లీ పేరును చెరిపేస్తారా? అని కొత్త ఓటర్లలో సంశయం నెల కొంది. వచ్చే సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సం ఘం ఓటరు నమోదుపై ప్రత్యేకదృష్టి సారించింది. అందులో భాగంగానే జిల్లా అధికారులు ప్రత్యేక ఓటర్డ్రైవ్ చేపట్టారు. నవంబర్ నుం చి డిసెంబర్ 23 వరకు కొనసాగిన ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తం గా 1,38, 234 మంది కొత్తగా ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. విచారణ చేపట్టిన అధికారులు వాటిలో కేవలం 18,524 దరఖాస్తులను మాత్రమే పరిష్కరించి నమోదుచేశారు. మిగిలిన వాటిని ఎప్పటివరకు పూర్తిచేస్తారో తెలియని అంతుచిక్కని ప్రశ్నగా మారిం ది. ఇదిలాఉండగా, వచ్చిన దరఖాస్తులన్నింటికీ అవకాశం కల్పించ డం కంటే అరకొరగా అవకాశం కల్పించి అందుకు రెట్టింపువాటిని తిరస్కరించడం అధికారులకు అలవాటుగా మారింది. గతేడాది నవంబర్లో ఓటరు జాబితాను విడుదల చేసే నాటికి 73వేల మంది కొత్తవారికి అవకాశం కల్పించి 93వేల దరఖాస్తులను పైగా తిరస్కరించారు. ఇప్పుడు కూడా ఏం చేస్తారోనని దరఖాస్తుదారుల్లో అయోమయం నెలకొంది.
గడువు వారం రోజులు
లక్షకు పైగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించేందుకు ఇక వారంరోజులు మాత్రమే గడువు ఉంది. వీటన్నిం టిని ఈనెల 13 లోగా పరిష్కరించి ఎన్నికల కమిషన్కు ఆప్లోడ్ చేయాల్సి ఉంది. కానీ దరఖాస్తులను పరిష్కరించడమే పూర్తిచేయని అధికారులు ఆప్లోడ్ చేయడం సాధ్యమయ్యేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈసారైనా జిల్లా ఓటర్ల సంఖ్యను పెంచుతారా? లేక ఉన్నవారిని తొలగిస్తారో వారం రోజులు వేచిచూడాల్సిందే.
గడువులోగా పరిష్కరిస్తాం...
ప్రస్తుతం వచ్చిన దరఖాస్తులను గడువులోగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని కలెక్టరేట్ ‘సి’ సెక్షన్ తహశీల్దార్ చందర్ తెలిపారు. ఇందుకోసం కలెక్టర్ ఆదేశాలతో ఎక్కువమంది సిబ్బందితో పాటు కంప్యూటర్లను ఏర్పాటుచేసి ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. విచారణతో పాటు అప్లోడ్ ను పూర్తిచేసే పనిలో ఉన్నామని తెలిపారు.