దండిగా దుంగలు పట్టివేత | Due to Red wood robbery 12 smugglers are arrested | Sakshi
Sakshi News home page

దండిగా దుంగలు పట్టివేత

Dec 11 2013 2:49 AM | Updated on Sep 2 2017 1:27 AM

జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో అటవీ అధికారులు జరిపిన దాడిలో భారీగా ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన 12 మంది స్మగ్లర్లను అరెస్టు చే శారు.

 ఒంటిమిట్ట/రైల్వేకోడూరు అర్బన్/ సుండుపల్లె, న్యూస్‌లైన్: జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో అటవీ అధికారులు జరిపిన దాడిలో భారీగా ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన 12 మంది స్మగ్లర్లను అరెస్టు చే శారు. దుంగల తరలింపునకు వాడిన వాహనాలనూ సీజ్ చేశారు. ఒంటిమిట్ట మండలం చింతరాజులపల్లె అటవీ ప్రాంతంలో భారీగా దుంగలతో పాటు మూడు వాహనాలను మంగళవారం తెల్లవారుజామున స్వాధీనం చేసుకున్నట్లు అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రెడ్డయ్య తెలిపారు.
 
 
 మంటపంపల్లె గరండాల వద్ద 57 ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న టాటాయేస్ వాహనంతో పాటు మరో పల్సర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆటో డ్రైవర్ రెడ్డిచెర్ల రామయ్య(గాండ్లపల్లె) అనే స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకున్నామని వివరించారు. అతన్ని విచారణ చేయగా మరి కొంత మంది పేర్లు తెలిసినట్లు చెప్పారు. వారిలో ఒంటిమిట్ట మండలం చేనివారిపల్లెకు చెందిన రాసాల కదిరయ్య ఉరఫ్ శంకర్‌దాదా, రాసాల నరసింహులు ఉరఫ్ బుట్టోడు, రాసాల రమేష్, పట్రపల్లెకు చెందిన రాసాల కదిరయ్య, బాలిపోగు హరి, బోయపల్లెకు చెందిన సాకే వెంకటరమణ, మీనుగ వెంకటసుబ్బయ్య ఉన్నారన్నారు. వీరంతా పేరుగాంచిన స్మగ్లర్ భద్రయ్య అనుచరులుగా గుర్తించామని పేర్కొన్నారు. పట్టుబడిన ఆటో భద్రయ్యకు చెందినదిగా సమాచారం అందిందన్నారు. తప్పించుకున్న స్మగ్లర్లందరినీ వీలైనంత త్వరలో పట్టుకుంటామన్నారు. మంటపంపల్లె బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ వద్ద ఇండికా కారులో తరలిస్తున్న 17 ఎర్రచందనం దుంగలనూ పట్టుకున్నామన్నారు.

ఈ కేసులో ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరు చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన రూప్‌సాయి, అశోక్‌గా గుర్తించామని తెలిపారు. బాలుపల్లె చెక్‌పోస్టు వద్ద మంగళవారం ఉదయం వాహన తనిఖీ సందర్భంగా కారును ఆపి తనిఖీ చేయగా అందులో పది దుంగలు తరలిస్తుండగా పట్టుకున్నామని బాలుపల్లె ఎఫ్‌ఎస్‌ఓ పిచ్చయ్య తెలిపారు. ఈ కేసులో బెంగళూరుకు చెందిన జాలీమ్‌ఖాన్‌తో పాటు, హోస్పేటకు చెందిన మునిరూపే, రైల్వేకోడూరు మండలం అయ్యవారిపల్లెకు చెందిన వెంకటరమణ ఉన్నారన్నారు.  
 
 సుండుపల్లె మండలంలోని అటవీ ప్రాంతంలో ఆరుగురు స్మగ్లర్లను అరెస్టు చేసి, వారి నుంచి దుంగలతో పాటు ఈచర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని డీఆర్‌ఓ సుదర్శన్ తెలిపారు. రెండ్రోజుల కిందట తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు రోళ్లమడుగు, సానిపాయి రేంజ్, తుమ్మల బైలు, వానరాచపల్లె తదితర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు సమాచారం అందగా తమ సిబ్బందితో అక్కడికి వెళ్లామన్నారు. అయితే తమ రాకను గమనించిన స్మగ్లర్లు రాళ్లతో దాడి చేసి పారిపోరని తెలిపారు.
 
 మంగళవారం వాహన తనిఖీల్లో స్కూటర్‌పై వెళ్తూ ఇర్ఫాన్, నవాజ్ పట్టుపడ్డారని చెప్పారు. వీరు కర్ణాటకలోని కోలార్ జిల్లా వాసులు. వారిచ్చిన సమాచారం మేరకు మత్తుస్వామి, రవి, శివకుమార్, రామమూర్తిను అరెస్టు చేశామని వివరించారు. వారి నుంచి ఈచర్ వాహనం సహా 70 దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. రేంజర్ అబ్దుల్‌ఖాదర్, సిబ్బంది పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement