చమన్ మృతిపై ప్రజల్లో అనుమానాలు
సాక్షి, అనంతపురం : టీడీపీ నేత, జెడ్పీ మాజీ చైర్మన్ దూదేకుల చమన్ మృతిపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. చమన్ మృతి చెందిన రెండు రోజులకే ఆయన డ్రైవర్ నూర్ బాషా ప్రమాదంలో మరణించడం వివాదస్పదంగా మారిందని తెలిపారు. నూర్ బాషాను ఢీకొన్న కారును ఇప్పటివరకు పోలీసులు ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. చమన్, పరిటాల కుటుంబం మధ్య అభ్రిప్రాయభేదాలు ఉన్నాయని.. చమన్ మృతదేహానికి వెంటనే పోస్టుమార్టం నిర్వహించాలని కోరారు. చమన్ మృతిపై సమగ్ర విచారణ చేపట్టి నిజాలు నిగ్గు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు.