మళ్లీ తెరపైకి అయ్యన్న సోదరుల విభేదాలు | Differences In The Family Of Former Minister Ayyanna | Sakshi
Sakshi News home page

మళ్లీ తెరపైకి అయ్యన్న సోదరుల విభేదాలు

Dec 13 2019 8:22 AM | Updated on Dec 13 2019 8:22 AM

Differences In The Family Of Former Minister Ayyanna - Sakshi

ఫిర్యాదు చేస్తున్న సన్యాసిపాత్రుడి తనయుడు వరుణ్‌

నర్సీపట్నం : మాజీ మంత్రి అయ్యన్న సోదరుల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. వైఎస్సార్‌సీపీలో చేరిన సోదరుడు సన్యాసిపాత్రుడు (జమీలు) తన ఇంటిపై పార్టీ జెండా కడుతుండగా అడ్డుతగలడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. మాజీ మంత్రి అయ్యన్న కుటుంబంలో విభేదాలు నెలకొనడంతో ఇటీవల సోదరుడు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ చింతకాయల సన్యాసిపాత్రుడు తన అనుచరగణంతో వైఎస్సార్‌సీపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఎప్పటి మాదిరిగానే ఒకే ఇంట్లో నివాసముంటున్నారు. గురువారం ముహూర్తం చూసుకుని తాను నివాసముంటున్న ఇంటిపై సన్యాసిపాత్రుడు కుమారుడు వరుణ్‌ జెండా కడుతుండగా వరుసకు చిన నాన్నమ్మ అయిన పెదపాత్రుని లక్ష్మి, మరో బంధువు హర్ష వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వీరి మధ్య స్వల్ప వివాదం చోటుచేసుకుంది.

అప్పటికే అనారోగ్యంతో ఉన్న లక్ష్మి స్వల్ప అస్వస్థతకు గురయ్యింది.  తన ఇంటిపై జెండా కడుతుండగా అడ్డుకుంటున్నారని, అదేవిధంగా మాజీ మంత్రి తనయుడు విజయ్, మరో బంధువు హర్ష వల్ల తనకు ప్రాణహాని ఉందని వరుణ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదేవిధంగా అస్వస్థతకు గురైన లక్ష్మి ఈ ఘటనపై ఫిర్యాదు చేసింది. దీంతో ముందస్తు చర్యగా పోలీసులు సన్యాసిపాత్రుడు, అయ్యన్న నివాసం వద్ద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులపై అయ్యన్న దురుసుతనం కాగా ఈ సందర్భంగా తన ఇంటికి వచ్చిన పోలీసులపై మాజీ మంత్రి అయ్యన్న విరుచుకుపడ్డారు. ‘తమాషాగా ఉందా.. మేం కోడితే ఏమిచేస్తావు నీవు.. మర్యాదగా వెళ్లిపొండి..పద్ధతి గల మనుషులము మేము..మా ఇంటికి వచ్చేటప్పుడు అనుమతి లేకుండా రాకూడదు..ఎవరిచ్చారు నీకు అనుమతి?’ అంటూ పోలీసులపై మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు దుర్భాషలాడుతూ దబాయించారు.  

Advertisement
 
Advertisement
Advertisement