విధి వింత క్రీడ

Daughter in law Died With Heart Stroke in Srikakulam - Sakshi

మామయ్య మృతి వార్త విన్నకోడలు మృతి

ఒకే ఇంట్లో చావు బాజా ధర్మపురంలో విషాదం

ఇచ్ఛాపురం రూరల్‌: మామయ్య మృతి చెందాడన్న వార్తను విన్న కోడలు ప్రాణాలు విడవడంతో ఆ గ్రామం విషాదంలో మునిగిపోయింది. కుటుంబానికి శోకాన్ని మిగిల్చిన సంఘటన మండలంలో ధర్మపురం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గత 15 రోజులుగా చలిగాలు తీవ్రంగా వీస్తుండటంతో గ్రామంలోని పిట్ట ఆదయ్య(75) చలికి తట్టుకోలేక ఆదివారం ఉదయం మృతి చెందాడు. విషయాన్ని పక్కవీధిలో ఉన్న చిన్న కుమారుడు పిట్ట వెంకటేష్‌కు కుటుంబ సభ్యులు తెలిపారు. మరణ వార్తను విన్న వెంకటేష్‌ భార్య పిట్ట మహాలక్ష్మీ(44) అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.

దీంతో కుటుంబ సభ్యులు హూటాహుటీన స్థానిక ఆర్‌ఎంపీ వైద్యునికి చూపించగా గుండెపోటుతో మరణించినట్టు ధృవీకరించారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. మామయ్య మృతిని తట్టుకోలేక మహాలక్ష్మి గుండెపోటుతో మరణించిందని బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతురాలి పెద్ద కుమారుడుకు ఈ ఏడాది ఫిబ్రవరి 22న వివాహం జరగనున్న నేపథ్యంలో ఈ విషాదం చోటుచేసుకోవడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top